సోమవారం, ఏప్రిల్ 21, 2014

1947 నాటి వ్యాపారప్రకటన



ఇప్పుడు టీవీలలో స్టైలుగా ఉండే యాడ్స్ చూడడం అలవాటైపోయిన మనకి 1947 నాటి యాడ్స్ చూస్తే కొంచెం నవ్వురావచ్చేమో. సరదాగా చదువుతారని కింద ఇస్తున్నాను.

శుక్రవారం, ఏప్రిల్ 11, 2014

బాల్యం - ఒక అందమైన జ్ఞాపకం


బాల్యం, ప్రతివ్యక్తి జీవితంలోనూ అందమైన జ్ఞాపకం.   నెమలికన్ను పుస్తకంలో దాచుకుని ప్రతిరోజూ దానికి  మేతవేస్తే అది కొన్ని రోజులకి పిల్లల్ని పెడుతుందని నమ్మే అందమైన అమాయకత్వం బాల్యంలోనే సాధ్యమవుతుందేమో. ఒక్కసారి గడిచిపోయిన రోజుల్నితడిమిచూసుకుంటే , చిన్నప్పుడు చేసిన్ ఎన్నో తిక్కపనులు, సరదా సంగతులు అప్రయత్నంగా చిరునవ్వురూపంలో పెదవులమీదనుంచి బయటకి వస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది,అలాంటి ఒకసరదా జ్ఞాపకమే ........

నేను ఐదోక్లాసు పరీక్షలు రాసేసమయానికి మా అన్నయ్య, పండుబావ ఎడోక్లాసు పబ్లిక్ పరీక్షలు రాశారు. ఇప్పటికి కొన్నిసంవత్సరాల క్రితం వరకు ఎడోక్లాసుకి కూడా పబ్లిక్ పరీక్షలు ఉండేవికదా, అవన్నమాట. అప్పటివరకు తోపుడు బండిలా క్లాసులనీ నెట్టుకుంటూ వచ్చేసినా ఎడోక్లాసుకి కచ్చితంగా పాసవ్వాల్సిన పరిస్థితి.
వీళ్ళు పరీక్షలు రాసినరోజునుంచి అమ్మకి,నాన్నకి,మామయ్యకి,అత్తకి అందరికి టెన్షను. ఏటెన్షను లేనిది ఇద్దరికే, అన్నయ్యకి, బావకి. ఇద్దరికి వాళ్ళరిజల్ట్స్ ఎలాఉంటాయో ముందేతెలుసు, కనుక హాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు.

   ఆసంవత్సరం శెలవలకి పండుబావా చిన్నారి వదిన మా ఇంటికొచ్చారు. ఇంక రిజల్ట్స్ రోజు రానేవచ్చింది. ఆరోజు అమ్మ మమ్మలందరిని ఉదయాన్నే నిద్రలేపి రడీచేసి గుడికి తీసుకుని వెళ్ళింది.  కొబ్బరికాయ కొట్టించి మాందరికి తలోఒక రూపాయి ఇచ్చి హుండీలో వెయ్యమంది. లాజిక్కు ప్రకారం చూస్తే పబ్లిక్ పరీక్షలు రాసింది అన్నయ్య,బావ కనుక వాళ్ళు వెయ్యాలి కానీ నేను వెయ్యవలసిన అవసరం లేదనిపించి  అమ్మ చూడకుండా ఆరూపాయని నా లాగూ జేబులో వేసుకున్నాను. అందరం కలిసి ఇంటికివచ్చేశాము. మేము ఇంటికి చేరేటైముకి నాన్న బజారుకివెళ్ళి పేపరు తీసుకునివచ్చి మాకోసం రడీగా కూర్చుని ఉన్నారు గుమ్మందగ్గర.

హాల్-టిక్కెట్లు తెచ్చి పేపర్లో ఇద్దరి నంబర్లు చూసింది అమ్మ. అప్పటి మాఅందరిమొహాల్లోనూ ఇప్పటి మొగలిరేకులు సీరియల్ చూస్తున్నంత టెన్షన్. అమ్మ మొత్తం చూసి అన్నయ్య ఫస్ట్ క్లాసులో పాసయ్యాడని ప్రకటించింది. నాకు తెలుసు అన్నట్లు అన్నయ్య చిరుమందహాసం చేశాడు. బావ నంబర్ కనిపించలేదు. నాకూతెలుసులే అన్నట్లు వాడుకూడా చూశాడుగాని ఇంతలో అందరు వాడివైపు కోపంగా చూడడంతో తప్పదని ఏడుపు మొహం పెట్టాడు. అక్కడ ఉన్నవాళ్ళలో కొంతమంది వాడిని తిట్టారు, కొంతమంది వెనకేసుకుని వచ్చారు. ఒక అరగంట తర్వాత నెమ్మదిగా వానవెలిసింది. అప్పటివరకూ తిట్టినవాళ్ళు, పొగిడినవాళ్ళు అలిసిపోయి ,టీతాగడానికి వెళ్ళారు.

  ఆసాయంత్రం నేనూ పండుబావా కలిసి గుడికి బయలుదేరాము. "ఈసారి  పరిక్షలలో ఖచ్చితంగా పాసవ్వాలని దేముడి దండంపెట్తుకునిరా.." అని అమ్మ ఒకటికి రెండుసార్లు బావకి చెప్పి మరీ పంపించింది. హుండీలో వెయ్యడానికి మాఇద్దరికీ తలో ఒక రూపాయి ఇచ్చింది. అదికూడా నాలాగూ జేబులో చేరిపోయింది  (చెప్పానుకదా నాకు పబ్లిక్ పరీక్షలు లేవని). ఇద్దరం కలిసి సైకిలుమీద బయలుదేరాము.

         "పొనీలేబావా ఈసారి ఖచ్చితంగా పాస్ అయిపోతావులే బాధపడకు"   అన్నాను నేను దారిలో వెళుతూ ఓదార్చుదామని.

          "నాగురించి నాకేం బాధలేదురా నాబాధంతా మీఅన్నయ్య గురించే"  అన్నాడు,కొంచెం ఆందోళనగా మొహం పెట్టి.  వాడేమంటున్నాడో నాకేం అర్ధంకాలేదు.

         "అదేంటి బావా వాడిగురించి ఎందుకు బాధపడడం వాడు పాసయ్యాడుకదా" అన్నాను నేను ఆశ్చర్యంగా వాడినిచూస్తూ.

"అందుకేరా నాబాధంతా, నువ్వు ఇంకా చిన్నవాడివి కనుక నీకు తెలియదు. ఎడోతరగతి మొదటిసారి రాసినప్పుడే పాసయిపోయామనుకో, పదోతరగతిలో ఖచ్చితంగా ఫెయిలయి పోతారు. అదే ఎడోతరగతిలో ఫెయిలయిపోయామనుకో పదోతరగతి ఖచ్చితంగా మొదటిసారి పాసయిపోతాం" అన్నాడు గంభీరంగా మొహంపెట్టి.

    మళ్ళీవాడే, "  ... ఇప్పుడు నాకు సెవెంత్ క్లాసు ఫెయిలయ్యినా పెద్ద ప్రాబ్లమెమీ లేదురా, వెంటనే పరీక్షలురాసి పాసయ్యిపోవచ్చు, కానీ టెంత్ క్లాసు ఫెయిలైతే మాత్రం సంవత్సరం వేస్టయిపోతుంది. అదేనాబాధంతా... " అన్నాడు.

      అదేం దిక్కుమాలిన లాజిక్కో నాకేం అర్ధంకాలేదు. కానీ, వాడలా అంటుంటే నాకు కూడా భయం వేసింది.  వచ్చే సంవత్సరం నేనుకూడా సెవెంత్ పరీక్షలు రాయాలి. ఎందుకైనా మంచిదని గుడిలోకి వెళ్ళినతరువాత, అమ్మ ఇచ్చిన రూపాయి దేముడికి వేసేసి, వచ్చే ఏడాది నేనుకూడా సెవెంతు ఫెయిలవ్వాలని దండంపెట్టుకుని, పుణ్యం ఎక్కువ రావాలని రెండుసార్లు ప్రసాదం తిని ఇంటికి తిరిగి వచ్చేశాము.


మంగళవారం, ఏప్రిల్ 08, 2014

లాల్ బహదూర్ శాస్త్రి అస్తమయం



తాష్కెంటు సమావేసమునకు వెళ్ళిన మన ప్రధానపంత్రి లాల్ బహదూర్ శాస్త్రి అస్తమయం. వివరములకు కింది పేపరు చదవండి.





సోమవారం, ఏప్రిల్ 07, 2014

గోదావరి-గవర్రాజు






గోదావరి- ఎక్కడో మహారాష్ట్రలో గోముఖం నుంచి చిన్నధారగా పుట్టి,మనరాష్ట్రంలోని రాజమండ్రివరకు అఖండగోదావరిగా ఉరుకులు పెట్టుకుంటూ ప్రవహించి,అక్కడినుంచి ఏడుపాయలుగా విడిపోయి ఉభయ గోదావరిజిల్లాలని సస్యశ్యామలం చేస్తూ సముద్రంలో కలిసిపోతుంది...రేవు నావలు నడిపేవారి దగ్గరనుంచి పెద్దపెద్ద పంట్లు నడుపుకునే వాళ్ళవరకు , చిన్నచిన తెప్పలలొ చేపలు పట్టుకునే వారి నుంచి మరపడవలలొ వేటకి వెళ్ళేవారి వరకు ఎందరికో ఈనది జీవనాధారం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసుకుని అలసిపోయిన శ్రమజీవులకి అది ఒక రీఫ్రెష్మెంట్ స్పాట్.చిన్నదైన మానరసాపురం మొత్తమ్మీద మోష్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అది.

   అక్కడే నాకొకసారి గవర్రాజు పరిచయం అయ్యాడు. చేపల వ్యాపారం చేసేవాడు. తెల్లవారుఝామునే పడవ వేసుకుని గోదావరి మధ్యలోకి వెళ్ళి వలలు పాతి,రాత్రి తిరిగి వెళ్ళి వలలో పడిన చేపలని తెచ్చుకుని మర్నాడు మార్కెట్ లో అమ్ముకునేవాడు.అప్పుడప్పుడు నేనుకూడా అతనితో కలిపి రాత్రి పడవలో వెళ్ళేవాడిని. పడవ మీద దాదాపు ఐదు అడుగుల పొడవుండే వెదురు కర్రని నిలపెట్టి, దానిమీద నూనె దీపం పెట్టి, అది ఆరిపోకుండా దానిచుట్టూ గాజుబుడ్డి అమర్చి తెడ్డు వేసుకుంటూ గోదాట్లోకి తీసుకెళ్ళేవాడు. వలలు బయటకి తీసి చేపలు పడవలో వేస్తూ "పంతులూ కూతంత పక్కకి కూకో చేపలు మీద పడిపోగలవు" అనేవాడు.నేను నవ్వుతూ పక్కకి జరిగితే , సడెన్ గా నావైపు తిరిగి "పెళ్ళాం పుస్తెలమ్మైనా పులస తినాలంటారు ,క్యారేజీలొ పులుసుంది కూతంత  రుచి సూత్తావేటి" అనేవాడు. నేను నిర్లఖ్యంగా చూస్తే నవ్వేస్తూ సరదాకి అన్నాలే సామి అంటూ సత్తు క్యారెజీలో తెచ్చిన మసాలావేసి ఉడికించిన మొక్కజొన్న గింజల్లో సగం నాకు పెట్టేవాడు.

     పూర్తిగా వెన్నెల ఉన్నరోజుల్లొ ఐతే తను వలలో పడిన చేపలని పడవలో వేస్తూ ఉంటే, నేను ఆ వెన్నెల వెలుగులో వెండిలా మెరిసిపోతున్న గోదావరిని చూస్తూ గడిపేసేవాడిని.   చేపలు బాగా పడిన రోజున ఉత్సాహంగా బోల్డు కబుర్లు చెప్పేవాడు, లేకపోతే చుట్ట నోట్లో పెట్టుకుని కాలుస్తూ తత్వాలు చెప్పేవాడు.ఉన్నట్లుండి సడెన్ గా  నావైపు తిరిగి "గోదారి మా అమ్మ తెలుసా" అనేవాడు. తను చుట్ట కాలుస్తున్నప్పుడు సరదాపుట్టి  నాకుకూడా ఒక చుట్ట ఇమ్మని అడిగితే,వెంటనే తను కాలుస్తున్న చుట్టని తీసి గోదాట్లొకి విసిరేసి,"ఛీ! నీకెందుకు చెప్పు ఈ చెడ్డ అలవాటు, నువ్వు మంచి వాడివి, అలాగే ఉండు అనేవాడు."

                  వెంటనే నేను "అంటే నువ్వు చెడ్డవాడివా" అని అడిగేవాడిని ఠక్కున.

         ".....అనికాదనుకో , చిన్నప్పుడు నాన్నతో కలిపి చేపలు పట్టడానికి గోదాట్లోకి వెళ్ళేవాడిని.నడిగోదాట్లో చలేస్తోంది అంటే కప్పుకోడానికి నాన్న రగ్గు ఇచ్చేవాడు.నాన్నకి జబ్బు చేసిన తర్వాత పక్కింటి మామతో వెళ్ళేవాడిని, అప్పుడు చలేస్తోంది అంటే మామ చుట్ట ఇచ్చేవాడు. కొంతకాలానికి రగ్గు ఇచ్చిన నాన్న,చుట్ట ఇచ్చిన మామ ఇద్దరూ పోయారు. ఈ పాడు అలవాటు మాత్రం మిగిలి పోయింది.ఇప్పుదు ఒళ్ళు పాడవుతుండని తెలిసినామానలేకపోతున్నాను.నీకు వద్దులే ఇలాంటి చెడ్డ అలవాట్లు..." అనేవాడు.

చేపల వ్యాపారంలోవచ్చే డబ్బులు సరిపోకనో ఏమో తెలియదుగానీ, కొంతకాలానికి అతను బ్రతుకుదెరువు నిమిత్తం గల్ఫ్ దేశాలకి  వెళ్ళిపోయాడు.వెళ్ళేముందర నన్ను కలిసాడు. రోజంతా నాతోనే ఉన్నాడు. అదే అతన్ని అఖరిసారి కలవడం.మళ్ళీ నాకు కనిపించలేదు.తరువాత మేము కూడా ఉద్యొగం కోసం వెరే ఊరు మారిపోయాము.దాదాపుగా ఆరుసంవత్సరాలు గడచిపొయాయి. ఎప్పుడైన ఊరువెళ్ళినప్పుడు తను కనిపిస్తాడేమో అని ఒకసారి అలా పడవలరేవు వరకు వెళ్ళి వస్తాను.   కాని నాకు నిరాశే మిగులుతుంది.అతని చుట్టాలెవరితోనూ నాకు పరిచయం లేదు. కనుక అతని గురించి సమాచారం కూడా ఎమీ తెలియలేదు. కాని అతనితో స్నేహం మత్రం అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.  

శనివారం, ఏప్రిల్ 05, 2014

సుబ్బయ్యతాత

మూడు సంవత్సరాల తరువాత మళ్ళీ మాఊరువచ్చాను. ఉద్యోగం కోసం దాదాపు ఆరు సంవత్సరాలక్రితం ఊరువిడిచి వెళ్ళినప్పటినుండి ఏడాదికి ఒకసారయినా ఎదోఒకవంకతో ఇక్కడికి వచ్చేవాడిని కానీ గత మూడు సంవత్సరాలుగా  వీలుచిక్కటంలేదు. బహుశా ప్రయత్నలోపంకావచ్చు. కానీ ఎందుకో పోయినవారం ఒక్కసారిగా ఊరిమీద  బోల్డంతప్రేమ పుట్టుకొచ్చింది. ఒకసారి అందరిని చూడాలనిపించింది.అనిపించడమేతడవు వెంటనే టిక్కెట్టు రిజర్వ్ చేయించుకుని బయలుదేరి వచ్చేశాను.రైలుదిగితూనే సరాసరి ఊర్లోనే ఉంటున్న మాపెదనాన్నగారింటికి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే రెష్టు తీసుకుని కొంచెం చల్లపడ్డాక సైకిలు మీద ఎంబరుమన్నారు స్వామి కోవెలకి బయలుదేరాను.ఎంబరుమన్నారుస్వామి అంటే తమిళంలో వెంకటేశ్వరస్వామి. ఆ గుడిని తమిళాయన కట్టించినందువల్ల తమిళనామంతోనే పిలుస్తారు. నాస్నేహితుడు కృష్ణ అక్కడే అర్చకత్వం చేస్తున్నాడు. నేను వేళ్ళేసరికి అక్కడ స్వామివారికి అభిషేకం చేస్తున్నాడు.దూరం నుంచి నన్నుచూస్తూనే పలకరింపుగానవ్వి కూర్చోఅక్కడ వస్తున్నా అన్నట్లు సైగ చేసాడు.నేను స్వామివారిని దర్సించుకుని ధ్వజస్తంభానికి పక్కగాఉన్నమంటపంలో కూర్చున్నాను.ఒక పావుగంటలో వచ్చాడు అభిషేకం అయిపోయినతర్వాత. అరిటాకులో తెచ్చిన  గోరువెచ్చని అప్పాలు,చెక్కరపొంగలి నాచేతిలో పెట్టాడు. తనకితెలుసు అవంటే నాకుచాలా ఇష్టంఅని.... తెస్తాడని నాకూతెలుసు.

                 "ఇంతకాలానికి మళ్ళీ మేము గుర్తొచ్చామన్నమాట.." అన్నాడు నవ్వుతూ నాపక్కన కూర్చుని.

                 నేనేమీ సమాధానం చెప్పలేదునవ్విఊరుకున్నా.

పదినిముషాలు కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇద్దరంకలిసి గోదావరిఒడ్డుకి బయలుదేరాము.
సైకిలుమీద కోవెలనునంచి రెండువీధులు దాటి దాదాపు జ్యోశ్యులవారి వీధివరకు వచ్చేశాము, వెనుకనుంచి ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి సైకిలు ఆపి వెనుకకితిరిగి చూశాము.

దాదాపు ఎనభైసంవత్సరాల వయసు ఉండే ముసలాయన,పరుగులాంటినడకతో దాదాపు వంద అదుగులదూరం నుండి మావైపేవస్తున్నాడు. కొంచెం దగ్గరకి వచ్చేసరికి పోల్చుకున్నాను. అతను సుబ్బయ్యతాత...........

........మా చిన్నప్పుడు మాస్కూలు దగ్గర ఉదయం పూట పిప్పరమెంటు బిళ్ళలు, ఉడికించిన వేరుశెనగకాయలు అమ్మేవాడు. టెంత్ క్లాస్ అయిపోయినతర్వాత మళ్ళీ తనని చూడడం ఇదే మొదటిసారి. దాదాపుగా పది సంవత్సరాల పైన అయిపోయింది. చాలకాలానికి మమ్మల్ని చూసిన ఆనందం అతని మొహంలో క్లియర్ గా కనిపిస్తోంది. వయసుతెచ్చిన అలసటవల్ల అనుకుంట కొద్దిపాటినడకకే ఒగరుస్తున్నాడు.

   ఒక్కసారిగ నాకుపాత సుబ్బయ్యతాత గుర్తుకువచ్చాడు.

...మా స్కూలుదగ్గర పిప్పరమెంటుబిళ్ళలు అమ్మే సమయానికే అతను చాలా పెద్దవాడు. కానీ చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడు.దాదాపు పది కిలోమీటర్లు దూరంలొ ఉండే వాళ్ళ ఇంటినుండి బుట్టలో సరుకులుపెట్టుకుని నడుచుకుంటూ మాస్కూలుదగ్గరకి వచ్చేవాడు.మమ్మల్ని అభిమానంగా చేరదీసి కబుర్లు చెప్పేవాడు. మేము తనదగ్గర ఏమైన కొనుక్కుని డబ్బులు ఇస్తే తీసుకునేవాడు లేకపోతే తనదగ్గర ఉన్నచిన్న పుస్తకంలొ అరువు రాసుకునేవాడు. అది ఎన్నాళ్ళకి తిరిగి మేము ఇచ్చినా అడిగేవాడుకాదు.నిజానికి అతను ఏనాడు డబ్బులు మిగుల్చుకోవడానికి వ్యాపారం చేసేవాడుకాదు.ఏదో గవర్నమెంటు ఆఫీసులో ప్యూను ఉద్యోగం చేసి రిటైరు అయ్యి, నెలనెలా వచ్చే పెన్షన్ ఇద్దరు కొడుకులకి సమానంగ పంచి ఇచ్చేస్తూ, నెలకి ఒకరిదగ్గర గడుపుకునేవాడు.ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూలుదగ్గర వ్యాపారం చేసుకుని సాయంత్రానికి ఇంటికి వెళ్తూ తర్వాతిరోజుకి సరుకులు కొనుక్కుని, మిగిలిన డబ్బులతో  తనకి లంక పొగాకు కాడలు, మనవలకి చిరుతిళ్ళూ కొనుక్కెళ్ళేవాడు.అంతవరకే అతనికి డబ్బు అవసరం. అంతకుమించి వచ్చే అవకాశం ఉన్నా అతను ఆశపడేవాడు కాదు...

   ఇన్నాళ్ళకి మమ్మల్ని చూసిన ఆనందంలో పావుగంట సేపు ఆపకుండా బోల్డు కబుర్లు చెప్పాడు.మాటలలో అతను వ్యాపారం మానివేసాడని ,ఇప్పుడు వేరే ఊరిలో  ఉంటున్నాడని అర్ధమైంది.

ఒక అరగంట కబుర్లుచెప్పుకున్న తర్వాత బయలుదేరుతూ కృష్ణ తాత చేతిలో ఏభైరూపాయలనోటు పెట్టాడు. అతని మొహం ఆనందంతో వెలిగిపోయింది.నేనుకూడా ఎమైనా ఇద్దాం అని జేబులో ఉన్న పర్సు బయటకి తీశాను. ఇందాకా ఏటిఎం లో విత్-డ్రా చేసిన వెయ్యిరూపాయలనోటు తప్ప చిన్నవి కనిపించలేదు.చూస్తూచూస్తూ అంత పెద్దనోటు ఇవ్వలేకపోయాను.చేసేది ఎమీలేక చిల్లరలేదు తాతా అన్నాను కొంచెం ఇబ్బందిగా మొహంపెట్టుకుని.పర్వాలేదులే బాబు, ఇప్పుడునాకు డబ్బులతో పనేముంటుంది,పొగాకుకాడలకి తప్ప. కృష్ణ ఇచ్చాడుకదా చాలులే అన్నాడు.కానీ ఆమాట అంటున్నప్పుడు అతని మొహంలో కనిపించిన చిన్నపాటి నిరాశ నాకళ్ళని దాటిపోలేదు. సరేనని తనకి విడ్కోలు చెప్పి మేము గోదావరివైపు బయలుదేరాము.కొద్ది దూరం వచ్చాముకానీ నామనసుకంతా వెలితిగా అనిపించింది. వెయ్యిరూపాయలు కొంచెం పెద్ద మొత్తమేకావచ్చు, కాని తాతకి ఇవ్వడంవల్ల నాకు పెద్దగా వచ్చే నష్టం ఎమీఉండదు. రోజూ చేసే ఎన్నో పిచ్చిఖర్చులతో పోలిస్తే ఇదేమీ అంతలెఖలోనిదీ కాదు.ఈ విషయంలొ అనవసరంగా లోభించానేమో అనిపించింది.ఇంక ఇలాకాదని సైకిలు ఆపి, కృష్ణని అక్కడే ఉండమని చెప్పి నేను వెనుకకి వెళ్ళాను ఆ డబ్బులు తాతకి ఇద్దాం అని. కాని అప్పటికే అతను అక్కడనుంచి వెళ్ళిపోయినట్లున్నాడు ఎంత వెతికినా నాకు కనిపించలేదు.నిర్ణయం తిసుకోవడంలొ చిన్నపాటి టైమింగ్ ప్రాబ్లం నాకు చాలా గిల్టిఫీలింగ్ మిగిల్చింది. ఇంక చెసేది ఎమీలేక వెనుకకి తిరిగివచ్చి , కృష్ణతోకలిసి గోదావరిఒడ్డుకి చేరుకున్నాను.





మాటజారితే

 ఒక్కొక్కసారి మనం అనుకొకుండానో, తీవ్రత అంచనా వెయ్యకుండానో మాటలు వదులుతూ ఉంటాం. తీరా మనతప్పు తెలుసుకునే సరికే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. తర్వాత తీరిగ్గా బాధపడడం తప్ప చెయ్యగలిగేది ఎమీఉండదు.
  మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభవమే నాకు ఎదురయ్యింది. ఎదోపనిఉండి మా కాలేజీకి వెళ్ళవలసి వచ్చింది.నా ఫ్రెండు కృష్ణని తోడుగా తీసుకుని వెళ్ళాను. పని పూర్తి అయ్యి బయటకి వచ్చేసరికి దాదాపు మధ్యాహ్నం అయ్యింది.మేము  రోడ్డుమీదకి వచ్చేసరికి మాడిగ్రీ క్లాస్-మీట్ శ్యామల ఎదురయ్యింది. అప్పటికి నేను తనని అఖరిసారి కలుసుకుని దాదాపు 5 సంవత్సరాలు అయ్యింది,మరలా ఇప్పుడే కలవడం. మమ్మల్ని చూస్తూనే స్కూటీ పక్కకి ఆపి మాదగ్గరకి వచ్చి నవ్వుతూ పలుకరించింది . ఒక పావుగంట కబుర్లు చెప్పినతర్వాత తాను ఇప్పుడు ఎదో కంప్యూటర్ కోర్సుచేస్తున్నానని, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నానని మరో ఐదు నిముషాలలో క్లాస్ స్టార్ట్ అవుతుంది కనుక మరొకసారి కలుస్తానని చెప్పి వెళ్ళిపోయింది.ఐదు సంవత్సరాలక్రితం కలిసినప్పుడు కూడా ఇలాగే ఎదో కోర్సు చేస్తున్నానని చెప్పింది.
     "ఇంక ఈఅమ్మాయి పెళ్ళి-పెటాకులు ఎమీ చేసుకొదేంట్రా, ఎంతసేపూ ఎదోఒక కోర్సు చెయ్యడం తప్ప..." అన్నాను నేను కృష్ణతో  ఒక్కొక్కసారి నాగొంతులో నాకుకూడా తెలియకుండా ధ్వనించే చిన్నపాటి వెటకారాన్ని నింపుకుని. కొంతసేపు వాడు ఎమీ మాట్లాడలేదు. తరవాత నెమ్మదిగా అన్నాడు. అలాకాదురా,ఎంతచదువుకున్నా ఎంత అందంగాఉన్నా ఆడపిల్ల పెళ్ళి చెయ్యాలంటే ఈరొజుల్లో కూడా లక్షలకిలక్షలు కట్నాలు ఇవ్వాలి. వీళ్ళ నాన్నేమో చిన్న సైకిలుషాపు నడుపుతాడు. మొన్ననే చాలా కష్టపడి వీళ్ళ అక్కకి పెళ్ళి చేసారు, ఈమెకికూడా చూస్తున్నారు. ఈమెది అయిపొతే వెనుక వీళ్ళ చెల్లి కూడాఉంది అన్నాడు. ఒక్కసారిగా నామాట ఆగిపోయింది. తిరిగి అలోచించి చూస్తే నేనెంత తొందరపడి మాట్లాడానో నాకు అర్ధమయ్యింది. ఆ గిల్టీ ఫీలింగ్ తోనే అనుకుంట కొంచెంసేపు మౌనంగాఉండిపొయాను.

  నెను మట్లాడడం అపేసరికి నా పరిస్థితిని కృష్ణ అర్ధంచెసుకున్నట్లున్నాడు  నాభుజం మీద చెయ్యి వేసి "అయినా అవన్ని నీకు నీకుమాత్రం ఎలా తెలుస్తాయి లేరా, నీకు చెల్లో అక్కో ఉండి ఉంటే తెలిసేది, నాకు కూడా మొన్న మా ఆక్క  పెళ్ళిలో ఈవిషయాలన్నీ కొంచెం అనుభవం లోకి వచ్చాయి,అందుకే అన్నారు పెళ్ళి చేసిచూడు, ఇల్లుకట్టి చూడు అని అర్ధం అయ్యిందా"  అన్నాడు నవ్వుతూ అనునయంగా .   ఇది జరిగిపోయి రెండునెలలు అయిపోయినా ఎప్పుడైనా గుర్తొస్తే కొంచెం బాధగాఅనిపించి మట్లాడేటప్పుదు ఒకటికి రెండుసార్లు అలోచించుకోవలసిన అవసరాన్ని నాకు గుర్తుచేస్తూ ఉంటుంది.

ఐస్-క్రీం బండి దుర్గారావు

రెండు నెలలక్రితం ఎదోపనిఉండి ఊరు వెళ్ళాల్సివచ్చింది. ఒక్కరోజు మాత్రమే శెలవుదొరకడంతో ఊరిలో దిగిన రోజే పని కంప్లీట్ అయ్యెలాగా ప్లాన్ చేసుకుని ఊళ్ళోదిగాను. అన్ని అనుకున్న ప్రకారమే కంప్లీట్ కావడంతో సాయంత్రం బండి క్యాచ్ చెయ్యడానికి తిరిగి స్టేషనుకి బయలుదేరాను. కృష్ణ నాతోపాటు వచ్చాడు నాకు సెండాఫ్ ఇవ్వడానికి. ఇంకా రైలుస్టార్ట్ అవ్వడానికి అరగంటకి పైగా టైము ఉండడంతో మేమిద్దరం అక్కడే స్టేషనులో నిలపడి మాట్లాడుకుంటున్నాం.ఇంతలో ప్లాట్-ఫారం మీద బండిమీద తిరుగుతూ ఐస్-క్రీము అమ్ముకుంటున్న ఇద్దరు పిల్లలు నాకు కనిపించారు. ఎక్కడో చూసినట్లనిపించింది. దగ్గరకి వచ్చాక బాగాపోల్చుకున్నాను. దుర్గారావు పిల్లలు వాళ్ళు. చటుక్కున దుర్గారావు గుర్తొచ్చాడునాకు.

   దుర్గారావు మాస్కూలుదగ్గర ఐస్-క్రీం బండి నడుపుకునేవాడు. రెండు రూపాయలు ఇస్తే పెద్ద బ్రెడ్డు-స్లైస్  మీద ఐస్-క్రీం పెట్టిఇచ్చేవాడు. సినిమాకబుర్లు బాగాచెప్పేవాడు. డబ్బులు లేనప్పుడు అరువు కూడా ఇచ్చేవాడు. మాకందరికి అతనంటే ఎందుకో కొంచెం అభిమానం ఉండేది.అప్పుడప్పుడు తనపిల్లల్ని కూడా తీసుకుని వచ్చేవాడు. మమ్మల్ని వాళ్ళకి చూపిస్తూ మీరుకూడా వీళ్ళలాగా బాగాచదువుకోవాలి అని చెప్పేవాడు. అప్పటికి వాళ్ళు బాగా చిన్నపిల్లలు.ఎమీ అర్ధంకానట్లు నవ్వేవాళ్ళు.ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళయ్యారు.

 " ..... ఆమధ్య జబ్బు చేసి దుర్గారావు సడన్ గా పోయాడురా, దానితో వీళ్ళకి చదువుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకే వాళ్ళ నాన్న వ్యాపారాన్నే కలిపి చెసుకుంటున్నారు.." అన్నాడు కృష్ణ . అప్పుడు గమనించానువాళ్ళని, పెద్దవాడు కొంచెం బలంగా,పొడుగ్గా ఉన్నాడు. కాని పాపం వాడికి కళ్ళు సరిగ్గా కనపడవనుకుంట, పెద్దపెద్ద సోడాబుడ్డి కళ్ళాద్దాలు వేసుకుని ఉన్నాడు. రెండో వాడికి అన్నీ బాగానే ఉన్నాయి గాని వాడు బక్కగా పొట్టిగా ఉన్నాడు.కాని వాళ్ళిద్దరు కలిపివ్యాపారం చేసుకుంటున్న పద్ధతిచూస్తే నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఇద్దరు కలిపి నడుపుకోవడానికి వీలుగా సైకిలుకి రెండుసీట్లు పెట్టించారు. పెద్దవాడు వెనుక కూర్చుని  పెడల్ తొక్కుతుంటే, చిన్నవాడు ముందుసీట్లో కూర్చుని హేండిల్ బార్ చూసుకుంటున్నాడు.

  వాళ్ళకేదైనా సాయం చెస్తే బాగుంటుందేమో అనిపించిందినాకు. కృష్ణ ఆపాడునన్ను. కష్టమోనష్టమో వాళ్ళజీవితాలు ఒకపద్దతిలో వాళ్ళుగడుపుతున్నారు.. ఇప్పటివరకు అప్పుకోసంకూడా ఎవరిదగ్గర చెయ్యిచాపినట్లు కూడా నేను చూడలేదు. నాకుతెలిసి నువ్వుఇచ్చినా వాళ్ళు తీసుకోరు అన్నాడు. సరేఅయితే ఎంచేద్దాం అన్నాను. రెండు ఐసులు కొను వాళ్ళదగ్గర,అది చాలు వాళ్ళకి మనం కూడా పుల్ల ఐసులు తినిచాలాకాలం అయినట్లుంది అన్నాడు నవ్వుతూ . ఇంతలో రైలు బయలుదేరుతున్నట్లు ఎనౌన్సుమెంటు రావడంతో నేను వాళ్ళని దగ్గరకిపిలిచి రెండు ఐస్-ఫ్రూట్లు కొని ఒకటి కృష్ణకి ఇచ్చి వీడ్కోలుచెప్పి రైలు ఎక్కాను.