బుధవారం, ఫిబ్రవరి 19, 2014

ఉచిత ఇంటర్నెట్ సౌకర్యానికి సిద్దంకండి.



ప్రపంచమ్మొత్తం ఇప్పుడు ఇంటర్నెట్ అనే సాలెగూడులో చిక్కుకునిఉంది.  రకరకాల ఆఫర్లతో సర్విసు ప్రొవైడర్లు మనల్ని ఊరిస్తూఉంటారు. ఉదయం లేచినదగ్గరనుంచీ రాత్రి పడుకునేవరకు మూడొంతులు పనులన్నీ ఆన్-లైన్ ద్వారా చేసుకోవడానికి అలవాటుపడిపోయినమనం నెలకి ఎంతోకొంత పేచేస్తూ పర్సుఖాళీ చేసుకుంటున్నాం.  కేబుల్ టీవీ,కరెంటు బిల్లు లాగానే మంత్లీబడ్జెట్లో ఇంటర్నెట్ బిల్లుకికూడా స్థానం ఇచ్చేశాం. అయితే ఇంకొక్క సంవత్సరం ఓపికపడితే మనబడ్జెట్లోంచి ఇంటర్నెట్ బిల్లు బరువు తగ్గించేస్తాను అంటోంది అమెరికాకి చెందిన
'మీడియా డెవలప్ మెంట్ ఫండ్' 
అనే సంస్థ. భూమిమీద ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటర్ నెట్ ఉచితంగా అందుబాటులోకి తేవడమే తన లక్యంగా ప్రకటించిందీసంస్థ. ఈ ప్రాజక్టుకి 'ఔటర్ నెట్' గా నామకరణం చేసింది. ఇందులో భాగంగా  'క్యూబ్ శాట్స్' అని పిలవబడే చిన్నచిన్న శాటిలైట్లను వందల సంఖ్యలో భూ కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఈ శాటిలైట్లతో ఇంటర్నెట్ ను ఫోన్లూ, కంప్యూటర్లు తదితర వస్తువులకు కనెక్ట్ చేస్తారు. ఆ శాటిలైట్ తరంగాల ద్వారా భూమ్మీద ఉన్న గాడ్జెట్స్ అన్నిటికీ ఉచితంగా నెట్ సౌకర్యం అందుబాటులోకి

వస్తుంది. ఇంట్లో మనం ఉపయోగించే  'వైఫై' లాగానే ఈఔటర్ నెట్ అనేది ప్రపంచస్థాయి 'వైఫై' అన్నమాట. ఇంటర్నెట్ మీద ఆంక్షలు ఉన్న చైనా,నార్త్ కొరియా వంటిదేశాలలోకూడా అప్పుడు ఆంక్షలురహిత ఇంటర్నెట్ వాడుకోవచ్చు అన్నమాట.2014 సెప్టెంబర్ లో ఈ ఔటర్ నెట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని స్పేస్ స్టేషన్ లో ప్రయోగించాలని ఈ సంస్థ నాసాను కోరనుంది. బహుశా 2015నాటికి ఈసౌకర్యం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావచ్చు.  కాకపోతే గూగుల్, ఫేస్-బుక్ వంటి తమదేశానికిచెందిన సంస్థల్ని అడ్డంపెట్టుకుని ప్రపంచదేశాల పౌరుల పర్సనల్డేటాని టెరాబైట్లకొద్దీ సేకరించి తనవద్ద దాచుకున్న అమెరికాకు చెందిన సంస్థ ఈ సేవని అందిస్తాను అని చెప్తుండడంతో ఇంటర్నెట్ పై ఆధిపత్యం కోసం అమెరికా ఆడుతున్న ఆటగా కొంతమంది సందేహిస్తున్నారు.