మంగళవారం, డిసెంబర్ 30, 2014

నూటికి తొంభై ఎనిమిది మార్కులు వచ్చినా మాకోదండానికి తిట్లు తప్పలేదు....

           

నేను 8వ తరగతిలో ఉన్నప్పటిమాట. మధ్యాహ్నం ఆఖరి క్లాసు జరుగుతోంది. వేదాంతం మాస్టారి క్లాసు. మ్యాథ్స్ సబ్జక్ట్. మాఅందరికీ ఆయనని చూస్తేనే భయం అందుకే అల్లరిచేసే సాహసం చేసేవాళ్ళం కాదు. అంతకు కొన్నిరోజుల క్రితమే క్వార్టర్లీ పరీక్షలు జరిగాయి. క్లాసులో పరీక్ష పేపర్లు ఇస్తున్నారు.అందుకని ఇంకా నిశ్శబ్దంగా ఉన్నాం. క్లాస్ లీడర్ పేరు పెట్టి ఒక్కొక్కరినీ పిలుస్తుంటే, మాస్టారు రూళ్ళకర్రతో మరోవైపు నిలపడి ఫెయిలు అయినవాళ్ళకి అక్కడే బడితపూజ చేస్తున్నారు. అందరి పేపర్లు ఇచ్చేశారు గానీ కోదండంగాడి పేపరు ఆకట్టలో లేదు. మాస్టారుకి కూడా ఎలా మిస్ అయ్యిందో అర్ధంకాలేదు.  ఆయనకూడా బుర్రగోక్కుంటూ… ” ఈసారి మీపేపర్లు నేను దిద్దలేదురా, హెడ్మాస్టారు దిద్దారు. ఆయనగదిలోనే పడిపోయి ఉంటుంది, ఉండు నేను వెళ్ళి చూసివస్తాను …” అని  బయలుదేరబోతూ ఇంతలో ఎదో గుర్తొచ్చినట్లు ఆగి,
"అయినా నీకొచ్చే మార్కుల సంగతి నాకు తెలియదా పట్టు చెయ్యి…"  అని కొట్టబోయారు.
దాంతో అప్పటివరకూ మామూలుగానే ఉన్న మావాడికి ఒక్కసారిగా ఉక్రోషం పొడుచుకు వచ్చి, సార్ నన్ను కొట్టకండి, నేను ఈసారి పరీక్షలు బాగా రాశాను, ఖచ్చితంగా పాసు అవుతాను అన్నాడు.
వాడిమాటలకి మాస్టారు ఒక్కసారిగా షాకయిపోయారు, వాదు అంత కాంఫిడెంటుగా మాట్లాడాడం చూసి మేము కూడా థ్రిల్లయిపోయాము.
ఒక్క సెకను ఆయన వాడివైపు అలాగే చూసి … " అవునా.. అయితే  పేపరు చూసిన తర్వతే చెప్తానీసంగతి…" అంటూ హెడ్మాస్టారి గదివైపుకి వెళ్ళబోయారు.
ఇంతలో హెడ్మాస్టారే అటువైపుకి వచ్చారు వాడిపేపరు పట్టుకుని. మాస్టారూ నేనే వాడీపేపరు తర్వాత ఇద్దామని ఆపానండీ అన్నారు 
".. ఆవునా,ఎందుకండీ…?? ఇంతకీ ఇంతకీ మావాడికి ఎన్నీమార్కులు వచ్చాయండీ..." అనడిగారు బెత్తం సరిచేసుకుంటూ.
"….నూటికి తొంభై ఎనిమిది…"
"అవునా …" అన్నారు నమ్మలేనట్లు.
ఇంతలోనే తేరుకుని “నేను చెప్పినవన్నీ కష్టపడిచదివినట్లున్నాడండీ వెధవ అందుకే అంత కాంఫిడెంటుగా మాట్లాడాడు…” అన్నారు గర్వంగా మొహంపెట్టి. 
కోదండం గాడుకూడా ఆయనవైపు గర్వంగా చూశాడు.
"కష్టపడడమా పాడా వెధవ కాపీకొట్టాడండి…" హెడ్మాష్టారు గర్జించారు.
అదిరిపడ్డాడు మావాడు.
ఉల్లిక్కిపడి చూశారు వేదాంతం మాష్టారు.
"ఏరా నేను చెప్పేదినిజమేనా …"
"…….. లేదండీ"… అన్నాడు చాలా కష్టంగా నోరు పెగల్చుకుని.
"నువ్వు అబద్దం చెప్తున్నావ్…" హెడ్మాష్టారు…
"…" మావాడు ఇంకా బిక్క చచ్చిపోయాడు.
"వెధవ.. పనికిమాలిన వెధవ … చెప్పినవి చదవడం ఎలాగో రాదు, కనీసం కాపీ  కొట్టాడంకూడారాదు..”
"ఇంతకీ ఏంజరిగిందండీ…" వేదాంతంగారు.
మీరే చూడండి అంటూ పేపరు ఆయనచేతికి ఇచ్చారు.
అవి చూసిన మాష్టారు భళ్ళున నవ్వేశారు.
ఇంతకీ ఎంజరిగిందంటే మావాడు నిజంగానే పరీక్షలలో స్లిప్పులు పెట్టి విజయవంతంగా రాసేశాడు, కానీ బాగా రాసిన ఆనందంలో చూసుకోకుండా స్లిప్పులు కూడా కలిపి కట్టేసి పేపర్లు ఇచ్చేశాడు, అడ్డంగా దొరికిపోయాదు. అదీసంగతీ.
కోపం, నవ్వు కలిసిపోయిన మొహంతో మావాడివైపు చూశారు మాష్టారు.
కానీ అప్పటికే మావాడు టెన్షన్ తో బిగుసుకుపోయాడు. వాడి ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది.
వాళ్ళముగ్గురినీ అలాచూస్తున్న మాకు కూడా నవ్వు ఆగడంలేదు. కానీ గట్టిగా నవ్వితే మాకుకూడా ఎక్కడా వడ్డిస్తారో ఆపుకుంటూ కూర్చున్నాం.
వాడిపరిస్థితి చూసిన ఆయనకికూడా ఇంక కొట్టడం అనవసరం అనిపించిందేమో ” ఫో వెధవా ఇంకెప్పుడైనా ఇలాచేశావంటే కాళ్ళు విరగ్గొట్టేస్తాను” అన్నారు.
వాడు బ్రతుకుజీవుడా అనుకుంటూ అక్కడనుంచీ జారుకున్నాడు.
ఇంతలో క్లాసు కంప్లీట్ గంట కొట్టడంతో మాష్టార్లిద్దరూ కూడా నవ్వుకుంటూ అక్కడనుంచీ వెళ్ళిపోయారు.
*****************************************************
చిన్నప్పుడు కాపీకొట్టి చదివినా మావాడు తర్వాత కష్టపడి చదివాడు. ఇప్పుడు వాడు ఐబిఎంలో సీనియర్ సాఫ్ట్-వేర్ ఇంజనీర్. మొన్నీమధ్య కలిసినప్పుడు మాటల మధ్యలో ఈవిషయం జ్ఞాపకంవచ్చి హాయిగా నవ్వేసుకున్నాం.



సోమవారం, అక్టోబర్ 27, 2014

చీమని చంపడం ఎలా....????





చీమని చంపడం ఎలా.... ?(1 మార్క్ క్వశ్చన్ )




చీమని వేలితో నలపడం ద్వారా చంపవచ్చు.


********************************************



చీమని చంపడం ఎలా.... ?(5 మార్క్స్ క్వశ్చన్ )

పంచదారలో కొంచెం కారం పొడి కలిపి చీమలపుట్టదగ్గర పెట్టాలిఅది తిన్న చీమకి దాహంవేస్తుందిఅప్పుడు అదినీళ్ళు తాగడంకోసం చెరువుకి వెళ్తుందిఅప్పుడు మనం దాని వెనకాలే వెళ్ళి దాన్ని నీళ్ళల్లోకి తోసేయ్యలి.  అప్పుడు అది తడిసిపోతుందితర్వాత దానికి చలి వేస్తుందిఅది చలి  కాచుకోవడానికి మంటదగ్గరకి వెళ్తుందిఅప్పుడు
ఆమంటమీదమనం పెట్రోలు పోసెయ్యలిదాని ఒళ్ళు కాలిపోతుందితర్వాత మనం   108కి కాల్ చేసిఅంబులెన్సులో  ఆసుపత్రికి తీసుకెళ్ళాలి.దాన్ని ఎమర్జన్సీ వార్డులో    జాయిన్ చెయ్యాలి.అప్పుడు చీమకి పైపుద్వారా ఆక్సిజన్ ఇస్తారు, అదిపీలుస్తూ చీమ   నిద్రపోయాక మనం నెమ్మదిగా వెళ్ళి పైపుతీసెయ్యలిఅప్పుడు ఆక్సిజన్ అందక    చీమ చనిపోతుంది.








ఒక మార్కు ప్రశ్న ఐదు మార్కులకి ఇస్తే పిల్లల సమాధానం ఇలాగే ఉంటుంది మరి...వాళ్ళు మార్కులకోసం ఎమైనా రాస్తారు

గురువారం, సెప్టెంబర్ 11, 2014

మాఊరి గోదావరి సాక్షిగా ఒక డాక్టర్ గారి పశ్చాతాపం



ఆరోజెందుకో  గోదారి ప్రశాంతంగా ఉంది. గాలిబాగానే ఉందిగానీ నదిలో పెద్దగా అలలులేవు. అప్పుడప్పుడు ఏ అంతర్వేది వెళ్ళే లాంచీనో ,చేపలబోటో వెళ్ళినప్పుడు కెరటాలు  కొంచెం కనిపిస్తున్నాయి



నేను గోదావరి గట్టు మెట్లమీద కూర్చుని నావెంట తెచుకున్న తుమ్మకర్రలతో వికెట్లు తయారుచేస్తున్నాను. మా బ్యాచ్ లో అందరికీ క్రికెట్ ఆడే పిచ్చి ఉందిగానీ ఆడడానికి అవసరమైన ఆయుధాల కిట్  మాత్రం శివ ఒక్కడిదగ్గరే ఉండేది.అదిమేము వాడుకోవడానికి వాడు కోరే గొంతెమ్మకోరికల లిష్టు మాత్రం చాలా పెద్దదిగా ఉండేది. బ్యాటు వాడుకోవాలంటే, గట్టిగా బ్యాటు పట్టుకోవడం రాకపోయినా వాడికే ఫష్టు బ్యాటింగ్ ఇవ్వాలి, అవుటయినా ఒకపట్టాన ఒప్పుకునేవాడుకాదు. బాలు,వికెట్లు ఇవ్వాలంటే ముందు వాడికే బౌలింగ్ ఇవ్వాలి. ఓవరుకి 6 బాల్సు కంప్లీట్ చెయ్యడానికి వాడు దాదాపు పన్నెండు నుంచి పదిహేను బాల్సు వేసేవాడు. ఏమైనా అంటే వాడెక్కడ అలిగి బాలు,బ్యాటు పుచ్చుకుని వాకౌట్ అంటాడోఅని చచ్చినట్లు వాడిని భరించేవాళ్ళం. అదిచాలదన్నట్లు మ్యాచ్ అయిపోయినతరువాత మాఅందరినీ కూర్చోపెట్టి మేము ఎవరం లేనప్పుడు వేరే టీం తో జరిగినా మ్యాచ్ లో తను ఎన్ని సిక్సులు కొట్టాడో, ఎంతమందిని ఫష్టు బాలుకి అవుటు చేశాడో కథలుకథలుగా వివరించి చెప్పేవాడు. అవి అబద్ధాలు  అనితెలిసినా చచ్చినట్లు నమ్మినట్లు నటించవలసి వచ్చేది. వాడి ఆటనిని భరించడంకంటే కంటే ఇలా నటించడం ఇంకా పెద్ద టార్చర్ లా అనిపించేది మాకు. ఇంక  వీడితో వేగడం మాతో కానిపని అని అర్ధం అయ్యిన తర్వాత, మేమే సొంతంగా కిట్టు కొనుక్కుందామని నిర్ణయించుకుని,ఇంట్లో వాళ్ళని డబ్బులడిగితే ఇవ్వడం మాట పక్కన పెట్టి రివర్సులో మాకు క్వార్టర్లీలో ఎన్ని మార్కులొచ్చాయి,హాఫెర్లీలో ఎన్ని మార్కులొచ్చాయి ఆరాలుతియ్యడం మొదలు పెట్టారు. వీళ్ళని డబ్బులడగడం మాదే తప్పని అర్ధమైన తరువాత మేమే సొంతంగా కిట్టు కొనుక్కుందామని నిర్ణయించుకుని, పాకెట్ మనీ పోగేస్తే బ్యాట్,బాల్  కొనగలిగాముగానీ వికెట్లకి డబ్బులు సరిపోలేదు. అందుకని అవి సొంతంగా తయరుచేసుకోవాలని నిర్ణయించుకుని ఇలా తుమ్మ కర్రలేసుకుని గోదారి గట్టుమీదకూర్చున్నాను. అతడు సినిమాలో చెప్పినట్లు ‘గులాబీ మొక్కకి అంటుకడుతున్నంత’ ఓపిగ్గా చెక్కుతున్నాను, ఇంతలో ఎవరో కొంచెం దూరంగా కూర్చుని మాట్లాడుకుంటున్నమాటలుఎవో వినిపించీ వినిపించకుండా వినిపిస్తున్నాయి. అప్పటివరకూ సీరియస్ గా పనిచేసుకుంటున్న నన్ను తెరలు తెరలుగా వినిపిస్తున్న వాళ్ళమాటలు అకర్షించాయి. నేను సగంసగం  చెక్కిన వికెట్లని పక్కనపెట్టి ,కూర్చున్న మెట్టుమీంచి రెండుమెట్లు పైకి ఎక్కి వాళ్ళకి దగ్గరగా కూర్చున్నాను. ఇప్పుడు కొంచెం స్పష్టంగా వినిపిస్తున్నాయి మాటలు.

 వాళ్ళిద్దరిలో ఒకాయన బాగా పెద్దవాడు,రెండవాయన మధ్య వయస్కుడు.
"అప్పు డు నేను తప్పుచేశానోయ్...." అన్నాడు ఆ పెద్దాయన.
"పోనీలెండి ఇప్పుడవన్నీ తలుచుకుని ఏంలాభం, వదిలేయండి..." అన్నాడు రెండవాయన.

ఇంతలో గాలిహోరు ఎక్కువై మాటలు మొత్తం సరిగ్గావినిపించలేదు .వాళ్ళు దేనిగురించి మాట్లాడుకుంటున్నారో తెలుసుసుకోవాలనా కుతూహలం మొదలయ్యింది నాలో... అసలు పనిపక్కనపెట్టి ఇంకొంచెం దగ్గరకి జరిగి కూర్చున్నాను. వినిపించిన మాటల్ని బట్టి ఆ పెద్దాయన ఒక డాక్టర్ అని ఇక్కడ కూర్చున్న రెండవ ఆయన అక్కకి ఒకప్పుడు ఆయన వైద్యం చేశాడని, కానీ ఆమె చనిపోయిందని అర్ధమైంది.

"అప్పట్లో నేను కొంచెం నిర్లఖ్యంగా ఉండేవాడినోయ్, అందరినీ సమానంగా చూసేవాడిని కాదు….. ఒకడాక్టరుగా అది నావృత్తి ధర్మానికి విరుద్ధం."

"........." ఇవతలివైపాయన ఎమీమాట్లాడాలేదు.

"అప్పటికీ మీఅమ్మగారు రెండు సార్లు వచ్చి పిల్లని చూడమని అడిగారు, నేనే సరిగ్గా పట్టించుకోలేదు, పట్టించుకునే సమయానికే పరిస్థితి చెయ్యిదాటిపోయింది..." ఆయనగొంతులో  కొంచెం బాధ ధ్వనించింది.
"..."
"ఇప్పుడు ఇంతవయసొచ్చిన తరువాత చచ్చేముందు ఆవిషయం గుర్తుకువస్తే మనసంతా వికలం అయిపోతోంది, ఆరోజే  నేను ఆ పిల్లకి సరిగ్గా వైద్యం చేసి ఉంటే ఈరోజు మీఇల్లు చక్కగా మీఅక్క పిల్లలతో పచ్చగా కళకళాలాడుతూ ఉండేది...".

కొంచెంసేపు ఇవతలాయన ఎమీమాట్లాడలేడు.

ఒక పదినిముషాల తరువాత నెమ్మదిగా అన్నాడు "పోనీలెండి ఇప్పుడు ఆ పాత విషయాలానీ తలుచుకుని ఏంలాభం, పోయిన పిల్ల ఎలాగో తిరిగిరాదు కదా. మీరింక ఆవిషయం వదిలేసి ప్రశాంతంగా ఉండండి..."

"కానీ ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా, గుండెల్లో ముల్లుగుచ్చుకున్నట్లవుతోందయ్యా.. పోయేకాలం  ముంచుకువస్తోంది కదా బహుశా పాపభీతికాబోలు.....!!!!! " అన్నాడు.

"…. నలభై ఏళ్ళక్రితం మాట, అసలు తను ఎలా ఉండేదో కూడా నాకు గుర్తులేదు. ఋణం తీరిపోయింది, వెళ్ళిపోయింది. పోవాలని రాసిపెట్టిఉన్నప్పుడు మనం మాత్రం ఏంచెయ్యగలం,... నాకుఊహ తెలిసినప్పటినుంచి మాఇంట్లో అందరికీ రాత్రి పగలు అనిచూడకుండా ఎప్పుడు పిలిచినా వచ్చి వైద్యం చేస్తున్నారు,ఆగౌరవం మీమీద మాకు ఎప్పుడూ ఉంటుంది, ఇంకా ఈ పాతవిషయాలన్నీ తలుచుకుని మనసు పాడు చేసుకోకండి.." అన్నాడు అనునయంగా.

కొంచెం విశ్రాంతిగా తలూపాడు ఆ పెద్దాయన.



ఇంతలో సాయంత్రం అయ్యింది. గోదారిగాలిలో చలిపెరిగింది. వాళ్ళిద్దరూ నెమ్మదిగాలేచి నడుచుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయారు. నేనుకూడా నాపని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాను

సోమవారం, జులై 28, 2014

తులసీదళం అనబడే ఒక కాష్మోరా కథ



అనగా అనగా ఒక పాప, పేరు తులసి. ముద్దుగా,బొద్దుగా ఉంటుంది(ట). ఆ పాపకి ఒక అమ్మా,నాన్న. పేరు శ్రీధర్, శారద. వాళ్ళకి బోల్డంత డబ్బు ఉంది. అయితే అదంతా తులసీవాళ్ళ నాన్న సంపాదినంచిదికాదు, కొంచెం ఆయన సంపాదిస్తే మిగిలినది వాళ్ళ కంపేనీ యజమాని(విదేశీయుడు) ముసలితనంతో తనదేశానికి వెళ్ళిపోతూ,వెళ్ళిపోతూ శ్రీధర్ మీద అభిమానంతో తను మనవరాలిలా భావించే తులసి పేరుమీద రాసినది. అయితే రాసేఆయనేదో తిన్నగా రాయచ్చుకదా, అలారాసేస్తే కిక్కేముంటుంది అనుకున్నాడేమో ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టాడు. తులసికి పదేళ్ళ వయసు వచ్చాక మాత్రమే ఆ డబ్బుకి తను హక్కుదారు అవుతుంది, ఇంతలోపు జరగరనిది ఎదైనా  తులసికి జరిగితే ఆ డబ్బంతా
ఒక అనాధ శరణాలయానికి చెందుతుంది. ఇదీ ఇక్కడ మెలిక. తులసికి పదేళ్ళు రావడానికి రెండునెలల ముందరవరకూ అంతా బానేఉంటుంది, తర్వాతే అసలు కథ మొదలవుతుంది. తులసిని అడ్డంతొలగించుకుంటే ఆస్తిమొత్తం కాజెయ్యచ్చు కదా అని అనాధశరణాలయం  వాళ్ళు కుట్ర చేస్తారు.తులసిని కత్తో,తుపాకినో పెట్టి చంపేయ్యచ్చు , కానీ అలాచేస్తే లాజిక్ ప్రకారం మొదట అనుమానం  వచ్చేది అనాధశరణాలయం  వాళ్ళ మీదే కనుక సేఫ్ గేం అడదాం అనుకుంటారు. బాగా అలోచించి,అలోచించీ పాపని క్షుద్రశక్తుల సాయంతో చంపుదాం అని నిర్ణయించుకుని ఒరిస్సా బయలుదేరి వెల్తారు. ఎందుకంటే అక్కడే కిలో బియ్యానికి కూడా మర్డర్లు చేసే మంత్రగాళ్ళు ఉంటారు(ట). అక్కడికి వెళ్ళి కాద్రా అనే మంత్రగాడిని పట్టుకుని వాడిసాయంతో పాపని చంపడానికి ప్రయత్నిస్తారు. తీరా చిన్నపిల్లని చంపడానికి కాద్రా ఒప్పుకోకపోవడంతో నిరాశగా తిరిగివస్తుంటే దారిలో   కాద్రా

శిష్యుడు ఒకడు తగిలి తాను ఆపని చెయ్యడానికి ఒప్పుకుని పాపకి చేతబడి చెయ్యడం మొదలు పెడతాడు. పని మొదలుపెట్టాక తులసికి అనారోగ్యం రావడంతో అసలు కథ మొదలవుతుంది. ఇంక అక్కడినుంచీ కథ రకరకాల మలుపులు తిరుగుతూ అనూహ్యంగా చేతబడి మంత్రాలు రివర్స్ కొట్టి కాద్రా శిష్యుడు  చచ్చిపోవడంతో అవేశంగా కాద్రాయే రంగంలోకి దిగుతాడు. అక్కడినుంచీ కథ ఇంకోమలుపు తిరుగుతుంది. అవేశంతో ఉన్నకాద్రా చిన్నాచితకా శక్తుల్ని కాకుండా మంత్రవిద్యలలో అతిభయంకరమయినది అయిన "కాష్మోరా" అనబడే భయంకరమైన క్షుద్ర శక్తిని పిచుకపై బ్రహ్మాస్త్రం లాగా తులసిమీద ప్రయోగిస్తాడు.  ప్రయోగం మొదలుపెట్టినరోజునుంచీ 21 రోజులపాటు ఆ కాష్మోరా తన టైం-టేబుల్ లో ఉన్న లిస్టు ప్రకారం పాపని రకరకాల రోగాలకి గురిచేస్తూ 21రోజు అర్ధరాత్రి దారుణంగా చంపెయ్యాలి. ఇంక అక్కడనుంచీ ప్రతిరోజూ పాపకి ఎదోఒక రోగమే. పాపావాళ్ళ అమ్మకీ, ఇంకా వాళ్ళింట్లో పనిచేసే ముసలిపనివాడికి ఇదేదో మంత్రగాళ్ళ పని అయిఉండవచ్చి అని అనుమానంవస్తుంది కానీ, పాపావాళ్ల  నాన్నారేమో ఇలాంటివి నమ్మడు. అందుకనీ పాపని హాస్పటళ్ళ చుట్టూ తిప్పుతూ తను ఏడుస్తూ ఇంట్లోవాళ్ళందరినీ ఏడిపిస్తూ చివరిరోజువరకూ గడిపేస్తాడు. ఇంకమరికొద్ది గంటలలో పాప చచ్చిపోతుందనగా రియలైజ్ అయ్యి ఒక ఫకీర్ ఇచ్చిన మంత్రదండం పట్టుకుని మనల్నందరినీ టెన్షన్ పెడుతూ కారులో ఒరిస్సావెళ్ళి కాద్రాని చంపేసి కూతుర్ని రక్షించుకుంటాడు. అదీకథ. కథముందుకునడిపే క్రమంలో అసలు క్షుద్రవిద్యలంటే ఏమిటి, చేతబడిలాంటి ప్రయోగాల్ని ఎలాచెయ్యచ్చు అనేవిషయాల్ని మనందరికీ చాలాసుళువుగా అర్ధమాయ్యేలాగ వివరిస్తాడు రచయిత.

         మొత్తం పుస్తకం చదవడం పూర్తయిన తరువాత నాకు అనిపించిందేమిటంటే "అసలు ఆ అమెరికావాడికి బుద్ధిలేదు....", అవును నిజంగానే లేదు. లేకపోతే చంపడానికి ఇంత ఈజీ పద్దతులుండగా ఆ లాడెన్ గాడిని చంపడానికి అన్ని బిలియన్లు ఖర్చు పెట్టాలా , చక్కగా మనదేశం వస్తే రాచమర్యాదలతో ఒరిస్సా తీసుకుని వెళ్ళి  ఇంకో కాద్రానో ,లేకపోతే బాద్రానో పరిచయంచేసేవాళ్ళంకదా. అప్పుడు పదోపాతికోఖర్చుపెడితే సరిపోయేది. కాకపోతే ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఒకసారి కాష్మోరాని ప్రయోగించిన తరువాత,ఎవరిమీదయితే  ప్రయోగించారో వాళ్ళనోటిలో ప్రతిరోజూ అర్ధరాత్రి 12.00 గంటలకు మూడు రక్తంచుక్కలు వెయ్యాలి,లేకపోతే ప్రయోగం తిరగబడే ప్రమాదం ఉంది. అంటే అమెరికావాడు ఎవరైనా తనమనిషిని లాడెన్ వాళ్ళింట్లో పెట్టుకుని, వాడి నోటిలో సరిగ్గా అర్ధరాత్రి 12.00 గంటలకు మూడు రక్తంచుక్కలు వేయించాలి. ఇప్పుడు అలాంటి మనిషెక్కడ దొరుకుతాడు. ఒకవేళ దొరికినా ఇక్కడా ఇంకో చిక్కు ఉంది. సదరు లాడెన్ అనబడేవాడు సుఖపురుషుడు. అంటే మనవాడికి దాదాపుగా నలుగురైదుగురు భార్యలు ఉన్నారు. ఏరాత్రి ఏభార్యగదిలో ఉంటాడో చెప్పలేం. ఒకరాత్రంతా ఒకభార్య గదిలోనేఉంటాడోలేదోకూడా చెప్పలేం. కనుక ఇలాంటి బాధలన్నీ నెత్తిమీద పెట్టుకోవడం ఎందుకు అనుకున్నాడోఎమో డైరెక్టుగా విమాలేసుకుని యుద్దానికే వెళ్ళాడు. ఇవన్నీ అలోచించిన తరువాత ఎంతైనా అమెరికావాడే నాకంటే తెలివైనవాడు అనిపించింది.

      ఇంక అమెరికావాడి సంగతి పక్కనపెట్టి, నావిషయానికి వస్తే హాయిగా చందమామకథలు, మంచిమంచి ఆటో-బయోగ్రఫీలు చదువుకునే నేను, వాడెవడో సజష్టు చేశాడనిచెప్పి ఈ దెయ్యాల,కాష్మోరాల కథలు చదివి, ఆ హేంగోవరుతో రాత్రుళ్ళు నిద్రపట్టక నన్ను ఆ బుక్కు చదవమని చెప్పినవాడిని నోటినిండా తిట్టుకుంటూ రెండురోజులు గడిపి మూడవరోజు రాత్రిపడుకునేడప్పుడు ఆంజనేయస్వామి సింధూరం పేట్టుకుని పడుకోవలసి వచ్చింది. ఇలాంటి పుస్తకాలు మరికొన్ని మార్కెట్లోకి వస్తేచాలు, చిల్లరమంత్రగాళ్ళకి, బాబాలకి బోల్డంతపని, కావలసినంత డబ్బు. కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి, పుస్తకం చదువుతున్నంతసేపూ పాపకి ఎమీజరగదని తెలుస్తున్నా, టెన్షన్ తగ్గకుండా ఆసాంతం చదివించడంలో రచయిత వందశాతం విజయం సాధించాడు.


శుక్రవారం, జులై 04, 2014

సర్దార్ వల్లభాయ్ పటేల్ అస్తమయం



స్వతంత్ర భారత రూపశిల్పి  సర్దార్ వల్లభాయ్ పటేల్  తేదీ 15-ఆగస్టు-1950  ఉదయం గం.9.37 ని.లకుహృద్రోగంతో మరణించారు.




గురువారం, జులై 03, 2014

అప్పుడు ఆయనకి ఎలా తెలిసిపోయిందో ఇప్పుడు నాకు అర్ధం అయ్యింది.....



"ఒరేయ్ చిన్నా ఇలారా... "  పెరట్లోంచి నాన్న గొంతు వినిపించింది.

ఏమైందో అనుకుంటూ వెళ్ళి ఆయనముందు నిలపడ్డాను

"నా బ్లేడుతో పెన్సిల్ చెక్కావా..." సబ్బు నురగతో నిడిన  గడ్డం మీద అక్కడక్కడ కనిపిస్తున్న చిన్నచిన్న గాయాల్ని అద్దంలో చూసుకుంటూ  అడిగారు.

"లేదునాన్న.. "  తడబడుతూనే అయినా ధైర్యంగా అబద్దం చెప్పేశాను.

"అబద్దం చెప్పకు .. నాకు తెలుసు నువ్వు  చెక్కావని, ఇంకెప్పుడూ అలా చెయ్యకు అర్ధం అయ్యిందా.." మృదువుగానేచెప్పారు.

"సరే నాన్న..." అని చెప్పి లోపలికి వచ్చేశాను.


లోపలికి వచ్చిన తరువాత ఎంత ఆలోచించినా పెన్సిలు చెక్కిన విషయం నాన్నకి ఎలాతెలిసిందో అర్ధం కాలేదు.

బాగా అలోచించి చూస్తే పెన్సిలు చెక్కినప్పుడు వచ్చే రజను బ్లేడుకి అంటుకుని ఉండిపోయిందేమో అనిపించింది.


అందుకని తర్వాతసారి వాడినప్పుడు బ్లేడుని బాగ తుడిచి మళ్ళీ నాన్న గడ్డం బాక్సులో పెట్టేశాను.

కాని విచిత్రంగా ఈ సారికూడా ఆయనకి తెలిసిపోయింది.

ఈసారి మళ్ళి పెరట్లోకి పిలిచి కొంచే గట్టిగానే డోసు ఇచ్చారు.


నేను అంత జాగ్రత్తపడినా ఈసారికూడా  ఆయనకి ఎలా తెలిసిపోయిందో  అన్న విషయం  సపోటా పండులో ఉండే గింజంత ఉండే నాబుర్రకి అప్పుడు అర్ధంకాలేదు.


నా సూక్ష్మబుద్దికి మరింతపదును పెట్టి ఆలోచిస్తే ఇదంతా మా అన్నయ్య నిర్వాకమేమో అనిపించినిది.


ఈసారి ఎవరూ ఇంట్లో లేనప్పుడు ప్రయత్నించా ....

తర్వాతరోజు మాటలతో చెప్పకుండా, చేతులతో చెప్పారు నాన్న.

ఇంక ఆ తరువాత నేనెప్పుడూ పెన్సిలు చెక్కడానికి బ్లేడు వాడలేదు. కాని చాలా సంవత్సరాలు ఆ విషయం నాన్నకి ఎలా తెలిసిపోయిందో అన్న విషయం నాకు ఒక ప్రశ్నలాగ మిగిలిపోయింది.



తర్వాత నేనుకూడా ఆవిషయం మర్చిపోయాను.



కొన్ని సంవత్సారాల తరువాత...
         

 మాఅన్నయ్య వాళ్ళ బాబుని ఈమధ్యనే స్కూలులో వేశాములెండి.

మొన్న ఆమధ్య వాడి పెన్సిలు చెక్కడానికి ఎవరో నాబ్లేడు వాడినట్లున్నారు. తరువాతరోజు నేను గడ్డం గీసుకుంటుంటే బ్లేడు కసక్కుమని తెగి కొంచెం మంట, అప్పటి నామనసులో ప్రశ్నకి సమాధానం ఒకేసారి వచ్చి పెదాలపై చిన్నగా నవ్వువచ్చింది.

ఆదివారం, జూన్ 29, 2014

మొన్న రైలులో నరసాపురం వెళ్ళివచ్చా గెట్-టు-గెదర్ కి.......

      జేబులో ఉన్న మొబైల్ బయటకితీసి టైం చూసుకున్నాను తొమ్మిదిన్నరకావస్తోంది. మాఊరువెళ్ళవలసిన రైలురావడానికి  ఇంకా అరగంటకిపైగా సమయం ఉంది. దానికంటే ముందువెళ్ళవలసిన  గౌతమి ఎక్స్-ప్రెస్ ఇంకా ప్లాట్-ఫారం మీదనే ఉంది.ఇంకా చాలా సమయం ఉండడంతో క్యాంటీనులోకి నడిచాను, వేడివేడిగా ఒక టీతాగి అరగంట తరువాత మళ్ళీ స్టేషనులోకి వచ్చాను, అప్పటికి గౌతమీ పెద్దకూతతో కిక్కిరిసిన ప్రయాణికులతో భారంగా స్టేషనునుంచి బయలుదేరింది. సెకెండుక్లాసు,ఏసీ కోచ్ లలో అయితే ఫరవాలేదుగానీ, జనరల్ పాసింజర్స్ ని చూస్తుంటేమాత్రం నిజంగానే భయంవేసింది. డోర్లదగ్గర,టాయ్-లెట్ల దగ్గర కిక్కిరిసి వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. నాకిలాంటి ఇబ్బంది రాకూడదనే ప్రయాణం కంఫార్మ్ అవ్వగానే ముందుగా ఆన్-లైన్లో టిక్కెట్టు బుక్ చేసేసుకున్నాను. గౌతమీ స్టేషను దాటిన పదిహేను నిముషాల తరువాత  మాఊరు వెళ్ళే రైలు అదేప్లాట్ ఫారమ్మీదకి నెమ్మదిగా వచ్చి ఆగింది. నేనెక్కవలసిన కోచ్ దగ్గర అంటించిన లిస్టులో నాపేరు ఒకసారి కంఫార్మ్ చేసుకుని లోపలికివెళ్ళి నాబెర్తుమీద బ్యాగు పడేసి కిటికీని ఆనుకుని కూర్చున్నాను. ఒక పదినిముషాల తర్వాత పెద్దకూతతో రైలు తీరిగ్గా స్టేషను నుంచి బయలుదేరింది. నేను నాబ్యాగులోంచి ఎదో పుస్తకం తీసుకుని చదువుకుంటూకూర్చున్నాను. ఒక పదినిముషాల తరువాత ఎదోస్టేషనులో ఆగింది. అక్కడ చాలామంది మాకంపార్టుమెంటులోకి ఎక్కారు. నేనదేమీ పట్టించుకోకుండా పుస్తకం చదువుకుంటున్నాను. ఇంతలో ఎవరో పెద్దావిడ వచ్చి నాపక్కన నిలబడింది. నేను తల ఎత్తి ఎమిటన్నట్లు చూసాను. నాది ఈ పైబెర్తేబాబు కానీ కాళ్ళునొప్పులు అంతపైకి ఎక్కలేను నువ్వు ఎమీఅనుకోనంటే అంటూ .. అర్ధోక్తిగా ఆగింది.అందులో అనుకోవడానికి ఎమీలేదు, ఆచీకటి సమయంలో లోయర్ బెర్తులో కూర్చుని కూడా చేసేదేమీ ఉండదు. అందులోనూ అంత పెద్దావిడ అడుగుతుంటే కాదనడం బాగోదు కనుక సరేనని పైకి ఎక్కి పడుకున్నాను.


           నరసాపురం మాఊరు. ఈప్రపంచంలో నాకు బాగానచ్చే ప్రదేశాలలో మాఊరుఒకటి. ఊరికి దూరంగా కొండ, ప్రతిరోజూ ఉదయాన్నే కొండచాటునుంచీ ఉదయించే ఎర్రని సూర్యబింబం, కొండమీదగుడి, గుడిముందు కోనేరు, అందులో కలువపూలు, లాంటి హంగులేమీ లేకపోయినా ఊరు ఎంతో అందంగాఉంటుంది. ఇప్పుడు నేనుంటున్న హైదరాబాదుకి అయిదువందల కిలోమీటర్లదూరంలో ఒకమూలగా బంగళాఖాతాన్ని ఆనుకుని ఉంటుంది. నేను ఇప్పుడు  ఇక్కడ రైలు ఎక్కితే తరువాతిరోజు ఉదయం తొమ్మిదింటికి అక్కడికి చేరుకుంటుంది. అసలు మాఊరు వెళ్ళడనికి ఈ రైలు ఒక్కటే కాదు, ఎన్నో ఆర్టీసీ,ప్రైవేటు బస్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. సాయంత్రం ఆరింటికి బస్సుఎక్కితే తర్వాతరోజు ఉదయాన్నే సూర్యోదయం కాకుండానే అక్కడదింపేస్తాయి. కానీ నాకు ఈ రాత్రి పదిగంటల రైలులో ప్రయాణమంటేనే ఇష్టం. ఇప్పుడు ఎక్కితే తరువాతిరోజు తెలవారకుండానే విజయవాడ వంతెనమీదకి వచ్చేసరికి ఆటోమేటిగ్గా మెలుకువ వచ్చేస్తుంది. అప్పుడు లేచి మొహం కడుక్కుని దూరంగా కొండమీద కనిపించే అమ్మవారికి రైలులోంచే దండం పెట్టేసుకుని, విజయవాడ స్టేషనులో ఆగినతరువాత దిగి వేడివేడి టీ తాగి పేపరుకొనుక్కుని మళ్ళీ తిరిగి రైలెక్కేసి కిటికీ పక్కన కూర్చుని చదవడం మొదలుపెడితే గుడివాడ చేరుకునే సమయానికి చదవడం అయిపోతుంది. అప్పటికి పూర్తిగా తెల్లవారిపోతుంది. రైలుకూడా అప్పటికి మూడొంతులుఖాళీ అయిపోతుంది. ఇంక అక్కడనుంచీ మనదే రాజ్యం. చిన్నచిన్న స్టేషనులలో అమ్మవచ్చే చిట్టి చిట్టిసమోసాలు కొనుక్కుతింటూ, మొబైల్ లో మెలోడీసాంగ్స్ వింటూ పచ్చని పొలాలు మధ్యలోంచీ, పంటకాలువలమీద కట్టిన చిన్నచిన్న వంతెనలమీదనుంచీ సాగిపోయే రిమైనింగ్ జర్నీ ఎంజాయ్ చెయ్యడమంటే నాకు చాలా ఇష్టం. అప్పటివరకూ ఎక్స్-ప్రెస్ లాగా దూసుకొచ్చిన రైలుకూడా అక్కడనుంచీ గుల్లనేల కావడంతో పాసింజరులాగా మారిపోయి కృష్ణా,గోదావరి జిల్లాల అందాలని మనకి చూపిస్తూ నెమ్మదిగా నరసాపురం చేరుకుంటుంది. ఒక పదినిముషాలు అటూ-ఇటూలో ఈసారికూడా అలాగే చేరుకుంది.


   ఉద్యోగంపేరుతో ఊరువిడిచి ఇప్పటికి ఆరు సంవత్సరాల పైనే అయ్యింది. అయినా సంవత్సరానికి ఒకసారో కుదిరితే రెండుసార్లో ఎదోఒక వంక పెట్టుకుని ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాను.అసలు నరసాపురం వెళ్తున్నామన్న  ఊహే ఎంతో అపురూపంగా అనిపిస్తుంది నాకు. పోయిన నెలలో నా చిన్ననాటి ఫణి ఒకసారి నాకు ఫోనుచేసి మన టెంత్-క్లాసు స్నేహితులంతా కలిసి గెట్-టు-గెదర్ పెట్టుకుంటే ఎలాఉంటుంది??,  అని అని అడిగాడు. నేనిక్కడ హైదరాబాదులో కూర్చుని "చాలబాగుంటుంది కానివ్వండి" అని చెప్పడం చాలా సుళువే, కాని అక్కడ ఊరిలో బాధ్యత తీసుకుని అన్నీ సక్రమంగా జరిగేలా చూడడమే చాలా కష్టం.  ఆమాటే నేను వాడితో అన్నాను. అవన్నీ మాకు వదిలైరా మనవాళ్ళంతా ఇక్కడేఉన్నారు కదా. మేము చూసుకుంటాము, నువ్వుమాత్రం ఒకరెండురోజులు ఉండేలాగా శెలవు పెట్టుకునిరా అన్నాడు. ఇదిగో దానికోసమే ఇప్పుడు ఇలా బయలుదేరివచ్చాను. వాళ్ళడిగినట్లు రెండురోజులు కుదరలేదుగానీ, ఒకరోజు శెలవు మాత్రం కుదిరింది. ఉదయాన్నేదిగి సాయంత్రం తిరుగుప్రయాణమయ్యేలా రిజర్వేషన్ చేయించుకున్నాను. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఫణి అప్పటికే అక్కడికి వచ్చేసి ఉన్నాడు. తనతో కలిసి తిన్నగా వాళ్ళింటికి వెళ్ళాను. అక్కడ పలకరింపులన్నీ పూర్తయిన తరువాత, స్నానం చేసి మరికొందరు స్నేహితులుతో కలిసి మేము చదివిన స్కూలుకి బయలుదేరాను.అక్కడే ఆరోజు జరగబోయే మాప్రోగ్రాం ప్లానుచేశాము.


     "టేలరు ఉన్నతపాఠశాల " అని బోర్డు పెట్టిఉన్న మాస్కూలు బిల్డింగు ఠీవీగా రోడ్డుపక్కకి నిలబడిఉంది. జార్జిటేలరు అనే బ్రిటీషాయన దాన్ని కట్టించాడు. ఆయనపేరుమీదనే అది టేలరు ఉన్నత పాఠశాల అయ్యింది. కానీ ఇదిమేము చదివినప్పటిదికాదు. మా స్కూలు చదువు పూర్తి అయిపోయి మేము కాలేజీకి వచ్చేసిన కొన్ని సంవత్సరాల తరువాత పాత పెంకుటింట్లోఉన్న స్కూలుని కూల్చేసి దాని స్థానంలో ఇప్పుడున్న కొత్త భవనం కట్టించారు. ఇది కూడా బాగానేఉంది, కాని దీనికంటే నాకు ఆ పాత పెంకుటిల్లే చాలా చాలా అందంగా అనిపిస్తుంది . ఒకటి నుంచి పదవతరగతి వరకూ విశాలమైన తరగతిగదులు, ఎలిమెంటరీని, హైస్కూలునీ విడదీస్తూ చిన్న ఆటస్థలం దానిలో గుబురైన మామిడిచెట్టు,ఎర్రటి పూలుండే మోదుగపూల చెట్లతో ఒకవిధమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. మేము ఆ చెట్లకిందే నిలబడి ప్రార్ధన చేసేవాళ్ళం.క్లాసులో ఎవరైనా ఎక్కువగా అల్లరిచేస్తే మాకు విధించే శిక్షకూడా ఆ చెట్టుకింద నిలబడడమే. కానీ అదిచాలా పెద్ద శిక్ష. క్లాసులో ఎంత అల్లరి చేసినా,దానికి ఎంత పెద్ద శిక్ష విధించినా బయట ఎవరికీ తెలియదు కనుక  పెద్ద నష్టం ఉండదు. కానీ చెట్టుకింద నిలబడితే అన్నిక్లాసులవాళ్ళకీ తెలిసిపోతుంది. ముఖ్యంగా హెడ్-మాష్టారు గారికి డైరెక్టుగా కనపడిపోతాం.అందుకనే ఆశిక్ష పడేంతగా కాకుండా కొంచెం తక్కువగా అల్లరిచేసేవాళ్ళం. మాటీచర్లు కూడా సాధారణంగా బెత్తంతో కొట్టడం, బెంచీ ఎక్కించడం లాంటి శిక్షలే వేసేవాళ్ళు.మా ఇల్లుకూడా స్కూలుకి దగ్గరగా ఉండేది, దాంతో మాటీచర్లందరికీ మా ఇంట్లోవాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉండేవి, అందువల్ల నేను ఎప్పుడైనా లిమిట్ దాటి  అల్లరిచేస్తే  క్లాసులో దెబ్బలు అన్నయ్యద్వారా ఇంటికిచేరి అక్కడ కంటిన్యూ అయ్యేవి. మాస్కూలులొ అల్లూరి సీతారామరాజు , యెల్లాప్రగడ సుబ్బరావుగారు లాంటివాళ్ళు చదువుకున్నారట. ఆ విషయాలన్నీ మాటీచర్లు మాకు చెప్పి  "అంత గొప్పగొప్పవాళ్ళు చదువుకున్న స్కూలులో చదువుకుంటున్నందుకు గర్వపడి మీరు కూడా బాగచదువుకోవాలి" అని మమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు. మాఅన్నయ్య లాంటి వాళ్ళు ఆ మాటలకి ఇన్స్పైరై బాగా చదువుకునేవాళ్లు. నాలాంటివాళ్ళు ఆ విషయాలన్నీ అడిగినవాళ్ళకీ అడగనివాళ్ళకి చెప్పుకుని గర్వపడేవాళ్ళం. మాకుపాఠాలు చెప్పే టీచర్లందికీ మాఫామిలీతో మంచి పరిచయాలు ఉండేవి. ఎప్పుడైనా సమాఖ్య కార్యక్రమాలుజరిగినప్పుడో లేక మరే ఇతరకార్యక్రమాల్లోనో వాళ్ళు మానాన్నగారు కలుసుకోవడం జరిగినప్పుడు ఆటోమేటిగ్గా మాచదువులగురించి ప్రస్తావన వచ్చేది. వాళ్ళందరూ ఎదో లంచాలు తీసుకున్నవాళ్లలాగా నాకంటే మాఅన్నయ్యకి మంచి ఫీడ్-బ్యాక్ ఎక్కువ ఇచ్చేవారు, మాతెలుగు మాష్టారు ఇంకా పిటి మాష్టారు మాత్రం నాకుకూడా మంచి ఫీడ్-బ్యాక్ ఇచ్చేవారు. అందుకే వాళ్ళిద్దరూ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది.  ఇప్పుడు వాళ్ళలో చాలామంది రిటైర్ అయిపోయారు. వాళ్ళందరినీకూడా పిలిచాము. వాళ్ళుకూడా చాలాఆనందంగా వచ్చారు. అనుకున్నప్రకారమే ఉదయాన్నే పదిగంటలకి కార్యక్రమం మొదలయ్యింది. టీచర్లలో చాలామంది సభలో మాట్లాడుతూ కొద్దిగాఉద్వేగానికి లోనయ్యారు.  కార్యక్రమం ముగిసినతరువాత మాస్నేహాలన్నీ ఇలాగే కొనసాగాలని మమ్మల్ని ఆశీర్వదిస్తూ వెళ్ళిపోయారు. అప్పటికి టైం సాయంత్రం అయిదు కావస్తోంది. మీల్సు ఇంకా మిగిలినపనులూ అన్నీ ముందే కాంట్రాక్టుకి మాట్లాడేసుకోవడంవల్ల మాకు పెద్దగా శ్రమ పడవలసిన అవసరం లేకపోయింది. నా రైలుకి ఇంకా గంట టైము ఉండడంవల్ల అందరం కలిసి అలా గోదావరి ఒడ్డుకి వెళ్ళి ఒక అరగంట కూర్చుని అక్కడనుంచి అందరం కలిసి తిన్నగా రైల్వేస్టేషనుకి చేరుకున్నాము.  అప్పటికి రైలు వచ్చేసిఉంది. నేను అందరికీ వీడ్కోలు చెప్పి తిరుగుప్రయాణం అయ్యాను

శుక్రవారం, జూన్ 13, 2014

కోతిబావ అల్లరి ...





కోతిబావ అల్లరి చూడాలని ఉందా అయితే ఈ వీడియో చూడండి....









సోమవారం, జూన్ 09, 2014

మైక్రో-సాఫ్ట్ మరొక ఆవిష్కరణ "స్కైప్ ట్రాన్సలేటర్"




మూడు సంవత్సరాలక్రితం దాదాపు $8.5 బిలియన్లతో వీడియో కాలింగ్ సేవలని అందించే సంస్థ అయిన స్కైప్ ని కొనుగోలు చేసిన మైక్రో-సాఫ్ట్ సంస్థ, తనవద్దనున్న మైక్రో-సాఫ్ట్ ట్రాన్సలేటర్ పరిజ్ఞానాన్ని స్కైప్ కి జోడించి "స్కైప్ ట్రాన్సలేటర్" ని ఆవిష్కరించింది. మే 27న కాలిఫోర్నియాలో జరిగిన కోడ్ కాన్-ఫ్రెన్స్ లో మైక్రో-సాఫ్ట్ సియిఓ సత్య నాదెళ్ళ, స్కైప్ కార్పోరేట్ వైస్-ప్రెసిడెంట్ గురుదీప్ పాల్ ఈ "స్కైప్ ట్రాన్సలేటర్" ని పరిచయం చేశారు.ఈ సందర్భంగా గురుదీప్ పాల్ కాలిఫోర్నియా లో ఇంగ్లీషులో మాట్లాడిన మాటలు విజయవంతంగా జర్మన్ భాషలోకి తర్జుమా అయ్యి లండనులో ఉన్న డయానా హెన్రిచ్ కి వినిపించాయి.


  అయితే ఈ కొత్త టెక్నాలాజీ ఏఏ భాషలకిఉపయోగించవచ్చో, ఇంకా దీనిని ఎప్పటికి వినియోగదారులకి అందుబాటులోకి తెస్తారో అన్నవిషయానికి మైక్రో-సాఫ్ట్ ప్రతినిధులు సరైన వివరణ ఇవ్వలేదు. ఈ సందర్భంగా మైక్రో-సాఫ్ట్ సియిఓ సత్య నాదెళ్ళ మాట్లాడుతూ "స్కైప్ ట్రాన్సలేటర్" పరిజ్ఞానాన్ని 'మైక్రో-సాఫ్ట్ రీసెర్చ్'మరియు 'మైక్రో-సాఫ్ట్ ట్రాన్సలేటర్' టీములు దశాబ్దానికి పైగా పడిన శ్రమకి ఫలితంగా అభివర్ణించారు.

  మాటలలో ఉండే భావాలని వదిలిపెట్టి, ఒక భాషనుంచి మరొక భాషకి పదాల మార్పిడి మాత్రమే చేసే ఈ పరిజ్ఞానంవల్ల అద్భుతాలని ఆశించడం అత్యాసేఅవుతుందనే కొంతమంది పెదవి విరుపులని పక్కనపెట్టి చూస్తే  ఈనాడు  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 మిలియన్ల వినియోగదారులు ప్రతినెలా స్కైప్ ని ఉపయోగిస్తున్నారు. సామాన్య వినియోగదారులేకాక కార్పోరేట్ వర్గాలు కూడా స్కైప్ ని విరివిగా ఉపయోగిస్తూ ఉంటాయి. వారు తమ వ్యాపార విస్తరణలో భాగంగా  కొత్త క్లయింట్లని సంపాదించుకునే క్రమంలో భాషే వారికి ప్రధాన అడ్డంకిగా నిలుస్తోంది. ఈ సమస్యని ఎదుర్కోవడానికి మైక్రో-సాఫ్ట్ ఆవిష్కరించిన ఈ పరిజ్ఞానం పట్ల వ్యాపారవర్గాల్లో అమితమైన 
ఆసక్తి కనిపిస్తోంది.














ఆధారం : http://www.geek.com/microsoft/microsoft-emulates-star-trek-turns-skype-into-a-universal-translator-1595044/

ఆదివారం, మే 11, 2014

పిల్లకాకి కంటే తల్లికాకే ఎప్పటికీ మంచిది



ఒక ఊరిలో ఒక మంచినీటి బావి ఉండేది,ఆ ఊరి మొత్తానికి అది ఒక్కటే మంచినీటి బావి.ఆ ఊరిలో ఉన్న స్త్రీలందరు ఉదయాన్నే ఆ బావి వద్దకి వచ్చి నీళ్ళు పట్టుకుని వెళ్ళేవారు. ఆ ఊరిలొ ఒక కాకి ఉండేది.అది ఉదయాన్నే ఆబావి వద్దకి వెళ్ళి దానిచుట్టూ చక్కర్లుకొట్టి,వీళ్ళునీళ్ళు పట్టుకునే సమయానికి ఆ బావి వరలమీద పడేలాగ రెట్ట వేసేది.నీళ్ళు పట్టుకోవడానికి వచ్చిన స్త్రీలు ఆ కాకిని తిట్టుకుని వరలని శుభ్రపరుచుకుని నీటిని పట్టుకెళ్ళేవారు.కొంతకాలానికి ఆకాకి ముసలితనం వల్ల చనిపోయింది.అక్కడివాళ్ళందరు పీడవిరగడైందని సంతొషించారు. ఆ కాకికి ఒక పిల్ల కాకి కూడా ఉంది. దానికి ఇలా అందరు తన తల్లిని తిట్టడం నచ్చలేదు. ఎమైన చేసి తన తల్లికి మంచి పేరు తిసుకుని రావాలి అనుకుంది,ఈసారి స్త్రీలు నీళ్ళు పట్టుకోవడానికి బావివద్దకి వచ్చినప్పుడు ఆబావి వద్దకి వెళ్ళి దానిచుట్టూ చక్కర్లుకొట్టి, వీళ్ళునీళ్ళు పట్టుకునే సమయానికి ఆ బావిలొ పడేలాగ రెట్ట వేసింది. అప్పుడు ఆ స్త్రీలందరు ఆపిల్లకాకి చేసిన పనికి చిరాకుపడి దీనికంటే ఆ తల్లి కాకే నయం అనుకున్నారు. ఆవిధంగా ఆపిల్లకాకి తల్లికాకికి మంచిపేరు తిసుకుని వచింది.

హైదరాబాదు కొఠిఏరియాలో ఉమెన్స్ కాలెజీ నుంచి కొఠి బస్ స్టాండ్ వెళ్ళే రూట్లో వన్ వే ట్రాఫిక్ ఉంటుంది. కొన్నిరోజుల క్రితం అక్కడ ఎడమ చేతి వైపు వెళ్ళేదారిలో దారిపొడవునా ఫుట్-పాత్ ని ఆనుకుని పుస్తకాల షాపులు ఉండేవి. వాళ్ళు ఫుట్-పాత్ ని ఆక్రమించుకునందే కాకుండా,రోడ్డుమీద సగం వరకు వచ్చేస్తూ దారినపొయే వాళ్ళందరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ట్రాఫిక్ కూడా జాం ఐపోయి చాలా అందరూ చాలా చిరాకుపడేవాళ్ళు. కొన్నాళ్ళు వాళ్ళ టార్చర్ భరించాక కొంతమంది పెద్దవాళ్ళు కలుగజేసుకుని కోర్టులొ కేసులు పెట్టి వాళ్ళని అక్కడనుంచి ఖాళీ చేయించారు. వెంటనే కార్పొరేషన్ వాళ్ళు అక్కడ రోడ్డు బాగుచేయించి పెడిష్ట్రెయిన్ పాత్ కుడా నిర్మించారు.దానిమీద పెద్దపెద్ద కుండిలతో పూలమొక్కలు కూడాపెట్టారు..పోనిలే ఇంక ట్రాఫిక్ జాం కష్టాలుతగ్గుతాయి అనుకున్నాం....:)

                             కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలబడలేదు....:(

ఇలా వాళ్ళు ఫూట్-పాత్ బాగుచేసివెళ్ళారు, మర్నాటికి ఆపాత్ మొత్తం ఒపెన్ ఎయిర్ టాయిలెట్ గా మారిపోయింది.పూలకుండీలు కుడా వదలలేదు కొందరు వీరులు. పుస్తకాలషాపులు ఉన్నప్పుడు కనీసం అటువైపునడవడానికైనా ఉండేది.ఇప్పుడు కనీసం అటువైపు నడవడానికైనా లేకుండాపొయింది. బోనస్ గా భరించలేని దుర్వాసన.దానిగురించి కనీసం పట్టించుకునే వాడు కుడాలేడు. ఇప్పుడనిపిస్తొంది పుస్తకాలషాపులున్నప్పుడే నయం అని...

నీతి : " పిల్లకాకి కంటే తల్లికాకే ఎప్పటికీ మంచిది"

సోమవారం, ఏప్రిల్ 21, 2014

1947 నాటి వ్యాపారప్రకటన



ఇప్పుడు టీవీలలో స్టైలుగా ఉండే యాడ్స్ చూడడం అలవాటైపోయిన మనకి 1947 నాటి యాడ్స్ చూస్తే కొంచెం నవ్వురావచ్చేమో. సరదాగా చదువుతారని కింద ఇస్తున్నాను.

శుక్రవారం, ఏప్రిల్ 11, 2014

బాల్యం - ఒక అందమైన జ్ఞాపకం


బాల్యం, ప్రతివ్యక్తి జీవితంలోనూ అందమైన జ్ఞాపకం.   నెమలికన్ను పుస్తకంలో దాచుకుని ప్రతిరోజూ దానికి  మేతవేస్తే అది కొన్ని రోజులకి పిల్లల్ని పెడుతుందని నమ్మే అందమైన అమాయకత్వం బాల్యంలోనే సాధ్యమవుతుందేమో. ఒక్కసారి గడిచిపోయిన రోజుల్నితడిమిచూసుకుంటే , చిన్నప్పుడు చేసిన్ ఎన్నో తిక్కపనులు, సరదా సంగతులు అప్రయత్నంగా చిరునవ్వురూపంలో పెదవులమీదనుంచి బయటకి వస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది,అలాంటి ఒకసరదా జ్ఞాపకమే ........

నేను ఐదోక్లాసు పరీక్షలు రాసేసమయానికి మా అన్నయ్య, పండుబావ ఎడోక్లాసు పబ్లిక్ పరీక్షలు రాశారు. ఇప్పటికి కొన్నిసంవత్సరాల క్రితం వరకు ఎడోక్లాసుకి కూడా పబ్లిక్ పరీక్షలు ఉండేవికదా, అవన్నమాట. అప్పటివరకు తోపుడు బండిలా క్లాసులనీ నెట్టుకుంటూ వచ్చేసినా ఎడోక్లాసుకి కచ్చితంగా పాసవ్వాల్సిన పరిస్థితి.
వీళ్ళు పరీక్షలు రాసినరోజునుంచి అమ్మకి,నాన్నకి,మామయ్యకి,అత్తకి అందరికి టెన్షను. ఏటెన్షను లేనిది ఇద్దరికే, అన్నయ్యకి, బావకి. ఇద్దరికి వాళ్ళరిజల్ట్స్ ఎలాఉంటాయో ముందేతెలుసు, కనుక హాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు.

   ఆసంవత్సరం శెలవలకి పండుబావా చిన్నారి వదిన మా ఇంటికొచ్చారు. ఇంక రిజల్ట్స్ రోజు రానేవచ్చింది. ఆరోజు అమ్మ మమ్మలందరిని ఉదయాన్నే నిద్రలేపి రడీచేసి గుడికి తీసుకుని వెళ్ళింది.  కొబ్బరికాయ కొట్టించి మాందరికి తలోఒక రూపాయి ఇచ్చి హుండీలో వెయ్యమంది. లాజిక్కు ప్రకారం చూస్తే పబ్లిక్ పరీక్షలు రాసింది అన్నయ్య,బావ కనుక వాళ్ళు వెయ్యాలి కానీ నేను వెయ్యవలసిన అవసరం లేదనిపించి  అమ్మ చూడకుండా ఆరూపాయని నా లాగూ జేబులో వేసుకున్నాను. అందరం కలిసి ఇంటికివచ్చేశాము. మేము ఇంటికి చేరేటైముకి నాన్న బజారుకివెళ్ళి పేపరు తీసుకునివచ్చి మాకోసం రడీగా కూర్చుని ఉన్నారు గుమ్మందగ్గర.

హాల్-టిక్కెట్లు తెచ్చి పేపర్లో ఇద్దరి నంబర్లు చూసింది అమ్మ. అప్పటి మాఅందరిమొహాల్లోనూ ఇప్పటి మొగలిరేకులు సీరియల్ చూస్తున్నంత టెన్షన్. అమ్మ మొత్తం చూసి అన్నయ్య ఫస్ట్ క్లాసులో పాసయ్యాడని ప్రకటించింది. నాకు తెలుసు అన్నట్లు అన్నయ్య చిరుమందహాసం చేశాడు. బావ నంబర్ కనిపించలేదు. నాకూతెలుసులే అన్నట్లు వాడుకూడా చూశాడుగాని ఇంతలో అందరు వాడివైపు కోపంగా చూడడంతో తప్పదని ఏడుపు మొహం పెట్టాడు. అక్కడ ఉన్నవాళ్ళలో కొంతమంది వాడిని తిట్టారు, కొంతమంది వెనకేసుకుని వచ్చారు. ఒక అరగంట తర్వాత నెమ్మదిగా వానవెలిసింది. అప్పటివరకూ తిట్టినవాళ్ళు, పొగిడినవాళ్ళు అలిసిపోయి ,టీతాగడానికి వెళ్ళారు.

  ఆసాయంత్రం నేనూ పండుబావా కలిసి గుడికి బయలుదేరాము. "ఈసారి  పరిక్షలలో ఖచ్చితంగా పాసవ్వాలని దేముడి దండంపెట్తుకునిరా.." అని అమ్మ ఒకటికి రెండుసార్లు బావకి చెప్పి మరీ పంపించింది. హుండీలో వెయ్యడానికి మాఇద్దరికీ తలో ఒక రూపాయి ఇచ్చింది. అదికూడా నాలాగూ జేబులో చేరిపోయింది  (చెప్పానుకదా నాకు పబ్లిక్ పరీక్షలు లేవని). ఇద్దరం కలిసి సైకిలుమీద బయలుదేరాము.

         "పొనీలేబావా ఈసారి ఖచ్చితంగా పాస్ అయిపోతావులే బాధపడకు"   అన్నాను నేను దారిలో వెళుతూ ఓదార్చుదామని.

          "నాగురించి నాకేం బాధలేదురా నాబాధంతా మీఅన్నయ్య గురించే"  అన్నాడు,కొంచెం ఆందోళనగా మొహం పెట్టి.  వాడేమంటున్నాడో నాకేం అర్ధంకాలేదు.

         "అదేంటి బావా వాడిగురించి ఎందుకు బాధపడడం వాడు పాసయ్యాడుకదా" అన్నాను నేను ఆశ్చర్యంగా వాడినిచూస్తూ.

"అందుకేరా నాబాధంతా, నువ్వు ఇంకా చిన్నవాడివి కనుక నీకు తెలియదు. ఎడోతరగతి మొదటిసారి రాసినప్పుడే పాసయిపోయామనుకో, పదోతరగతిలో ఖచ్చితంగా ఫెయిలయి పోతారు. అదే ఎడోతరగతిలో ఫెయిలయిపోయామనుకో పదోతరగతి ఖచ్చితంగా మొదటిసారి పాసయిపోతాం" అన్నాడు గంభీరంగా మొహంపెట్టి.

    మళ్ళీవాడే, "  ... ఇప్పుడు నాకు సెవెంత్ క్లాసు ఫెయిలయ్యినా పెద్ద ప్రాబ్లమెమీ లేదురా, వెంటనే పరీక్షలురాసి పాసయ్యిపోవచ్చు, కానీ టెంత్ క్లాసు ఫెయిలైతే మాత్రం సంవత్సరం వేస్టయిపోతుంది. అదేనాబాధంతా... " అన్నాడు.

      అదేం దిక్కుమాలిన లాజిక్కో నాకేం అర్ధంకాలేదు. కానీ, వాడలా అంటుంటే నాకు కూడా భయం వేసింది.  వచ్చే సంవత్సరం నేనుకూడా సెవెంత్ పరీక్షలు రాయాలి. ఎందుకైనా మంచిదని గుడిలోకి వెళ్ళినతరువాత, అమ్మ ఇచ్చిన రూపాయి దేముడికి వేసేసి, వచ్చే ఏడాది నేనుకూడా సెవెంతు ఫెయిలవ్వాలని దండంపెట్టుకుని, పుణ్యం ఎక్కువ రావాలని రెండుసార్లు ప్రసాదం తిని ఇంటికి తిరిగి వచ్చేశాము.


మంగళవారం, ఏప్రిల్ 08, 2014

లాల్ బహదూర్ శాస్త్రి అస్తమయం



తాష్కెంటు సమావేసమునకు వెళ్ళిన మన ప్రధానపంత్రి లాల్ బహదూర్ శాస్త్రి అస్తమయం. వివరములకు కింది పేపరు చదవండి.





సోమవారం, ఏప్రిల్ 07, 2014

గోదావరి-గవర్రాజు






గోదావరి- ఎక్కడో మహారాష్ట్రలో గోముఖం నుంచి చిన్నధారగా పుట్టి,మనరాష్ట్రంలోని రాజమండ్రివరకు అఖండగోదావరిగా ఉరుకులు పెట్టుకుంటూ ప్రవహించి,అక్కడినుంచి ఏడుపాయలుగా విడిపోయి ఉభయ గోదావరిజిల్లాలని సస్యశ్యామలం చేస్తూ సముద్రంలో కలిసిపోతుంది...రేవు నావలు నడిపేవారి దగ్గరనుంచి పెద్దపెద్ద పంట్లు నడుపుకునే వాళ్ళవరకు , చిన్నచిన తెప్పలలొ చేపలు పట్టుకునే వారి నుంచి మరపడవలలొ వేటకి వెళ్ళేవారి వరకు ఎందరికో ఈనది జీవనాధారం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసుకుని అలసిపోయిన శ్రమజీవులకి అది ఒక రీఫ్రెష్మెంట్ స్పాట్.చిన్నదైన మానరసాపురం మొత్తమ్మీద మోష్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అది.

   అక్కడే నాకొకసారి గవర్రాజు పరిచయం అయ్యాడు. చేపల వ్యాపారం చేసేవాడు. తెల్లవారుఝామునే పడవ వేసుకుని గోదావరి మధ్యలోకి వెళ్ళి వలలు పాతి,రాత్రి తిరిగి వెళ్ళి వలలో పడిన చేపలని తెచ్చుకుని మర్నాడు మార్కెట్ లో అమ్ముకునేవాడు.అప్పుడప్పుడు నేనుకూడా అతనితో కలిపి రాత్రి పడవలో వెళ్ళేవాడిని. పడవ మీద దాదాపు ఐదు అడుగుల పొడవుండే వెదురు కర్రని నిలపెట్టి, దానిమీద నూనె దీపం పెట్టి, అది ఆరిపోకుండా దానిచుట్టూ గాజుబుడ్డి అమర్చి తెడ్డు వేసుకుంటూ గోదాట్లోకి తీసుకెళ్ళేవాడు. వలలు బయటకి తీసి చేపలు పడవలో వేస్తూ "పంతులూ కూతంత పక్కకి కూకో చేపలు మీద పడిపోగలవు" అనేవాడు.నేను నవ్వుతూ పక్కకి జరిగితే , సడెన్ గా నావైపు తిరిగి "పెళ్ళాం పుస్తెలమ్మైనా పులస తినాలంటారు ,క్యారేజీలొ పులుసుంది కూతంత  రుచి సూత్తావేటి" అనేవాడు. నేను నిర్లఖ్యంగా చూస్తే నవ్వేస్తూ సరదాకి అన్నాలే సామి అంటూ సత్తు క్యారెజీలో తెచ్చిన మసాలావేసి ఉడికించిన మొక్కజొన్న గింజల్లో సగం నాకు పెట్టేవాడు.

     పూర్తిగా వెన్నెల ఉన్నరోజుల్లొ ఐతే తను వలలో పడిన చేపలని పడవలో వేస్తూ ఉంటే, నేను ఆ వెన్నెల వెలుగులో వెండిలా మెరిసిపోతున్న గోదావరిని చూస్తూ గడిపేసేవాడిని.   చేపలు బాగా పడిన రోజున ఉత్సాహంగా బోల్డు కబుర్లు చెప్పేవాడు, లేకపోతే చుట్ట నోట్లో పెట్టుకుని కాలుస్తూ తత్వాలు చెప్పేవాడు.ఉన్నట్లుండి సడెన్ గా  నావైపు తిరిగి "గోదారి మా అమ్మ తెలుసా" అనేవాడు. తను చుట్ట కాలుస్తున్నప్పుడు సరదాపుట్టి  నాకుకూడా ఒక చుట్ట ఇమ్మని అడిగితే,వెంటనే తను కాలుస్తున్న చుట్టని తీసి గోదాట్లొకి విసిరేసి,"ఛీ! నీకెందుకు చెప్పు ఈ చెడ్డ అలవాటు, నువ్వు మంచి వాడివి, అలాగే ఉండు అనేవాడు."

                  వెంటనే నేను "అంటే నువ్వు చెడ్డవాడివా" అని అడిగేవాడిని ఠక్కున.

         ".....అనికాదనుకో , చిన్నప్పుడు నాన్నతో కలిపి చేపలు పట్టడానికి గోదాట్లోకి వెళ్ళేవాడిని.నడిగోదాట్లో చలేస్తోంది అంటే కప్పుకోడానికి నాన్న రగ్గు ఇచ్చేవాడు.నాన్నకి జబ్బు చేసిన తర్వాత పక్కింటి మామతో వెళ్ళేవాడిని, అప్పుడు చలేస్తోంది అంటే మామ చుట్ట ఇచ్చేవాడు. కొంతకాలానికి రగ్గు ఇచ్చిన నాన్న,చుట్ట ఇచ్చిన మామ ఇద్దరూ పోయారు. ఈ పాడు అలవాటు మాత్రం మిగిలి పోయింది.ఇప్పుదు ఒళ్ళు పాడవుతుండని తెలిసినామానలేకపోతున్నాను.నీకు వద్దులే ఇలాంటి చెడ్డ అలవాట్లు..." అనేవాడు.

చేపల వ్యాపారంలోవచ్చే డబ్బులు సరిపోకనో ఏమో తెలియదుగానీ, కొంతకాలానికి అతను బ్రతుకుదెరువు నిమిత్తం గల్ఫ్ దేశాలకి  వెళ్ళిపోయాడు.వెళ్ళేముందర నన్ను కలిసాడు. రోజంతా నాతోనే ఉన్నాడు. అదే అతన్ని అఖరిసారి కలవడం.మళ్ళీ నాకు కనిపించలేదు.తరువాత మేము కూడా ఉద్యొగం కోసం వెరే ఊరు మారిపోయాము.దాదాపుగా ఆరుసంవత్సరాలు గడచిపొయాయి. ఎప్పుడైన ఊరువెళ్ళినప్పుడు తను కనిపిస్తాడేమో అని ఒకసారి అలా పడవలరేవు వరకు వెళ్ళి వస్తాను.   కాని నాకు నిరాశే మిగులుతుంది.అతని చుట్టాలెవరితోనూ నాకు పరిచయం లేదు. కనుక అతని గురించి సమాచారం కూడా ఎమీ తెలియలేదు. కాని అతనితో స్నేహం మత్రం అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.  

శనివారం, ఏప్రిల్ 05, 2014

సుబ్బయ్యతాత

మూడు సంవత్సరాల తరువాత మళ్ళీ మాఊరువచ్చాను. ఉద్యోగం కోసం దాదాపు ఆరు సంవత్సరాలక్రితం ఊరువిడిచి వెళ్ళినప్పటినుండి ఏడాదికి ఒకసారయినా ఎదోఒకవంకతో ఇక్కడికి వచ్చేవాడిని కానీ గత మూడు సంవత్సరాలుగా  వీలుచిక్కటంలేదు. బహుశా ప్రయత్నలోపంకావచ్చు. కానీ ఎందుకో పోయినవారం ఒక్కసారిగా ఊరిమీద  బోల్డంతప్రేమ పుట్టుకొచ్చింది. ఒకసారి అందరిని చూడాలనిపించింది.అనిపించడమేతడవు వెంటనే టిక్కెట్టు రిజర్వ్ చేయించుకుని బయలుదేరి వచ్చేశాను.రైలుదిగితూనే సరాసరి ఊర్లోనే ఉంటున్న మాపెదనాన్నగారింటికి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే రెష్టు తీసుకుని కొంచెం చల్లపడ్డాక సైకిలు మీద ఎంబరుమన్నారు స్వామి కోవెలకి బయలుదేరాను.ఎంబరుమన్నారుస్వామి అంటే తమిళంలో వెంకటేశ్వరస్వామి. ఆ గుడిని తమిళాయన కట్టించినందువల్ల తమిళనామంతోనే పిలుస్తారు. నాస్నేహితుడు కృష్ణ అక్కడే అర్చకత్వం చేస్తున్నాడు. నేను వేళ్ళేసరికి అక్కడ స్వామివారికి అభిషేకం చేస్తున్నాడు.దూరం నుంచి నన్నుచూస్తూనే పలకరింపుగానవ్వి కూర్చోఅక్కడ వస్తున్నా అన్నట్లు సైగ చేసాడు.నేను స్వామివారిని దర్సించుకుని ధ్వజస్తంభానికి పక్కగాఉన్నమంటపంలో కూర్చున్నాను.ఒక పావుగంటలో వచ్చాడు అభిషేకం అయిపోయినతర్వాత. అరిటాకులో తెచ్చిన  గోరువెచ్చని అప్పాలు,చెక్కరపొంగలి నాచేతిలో పెట్టాడు. తనకితెలుసు అవంటే నాకుచాలా ఇష్టంఅని.... తెస్తాడని నాకూతెలుసు.

                 "ఇంతకాలానికి మళ్ళీ మేము గుర్తొచ్చామన్నమాట.." అన్నాడు నవ్వుతూ నాపక్కన కూర్చుని.

                 నేనేమీ సమాధానం చెప్పలేదునవ్విఊరుకున్నా.

పదినిముషాలు కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇద్దరంకలిసి గోదావరిఒడ్డుకి బయలుదేరాము.
సైకిలుమీద కోవెలనునంచి రెండువీధులు దాటి దాదాపు జ్యోశ్యులవారి వీధివరకు వచ్చేశాము, వెనుకనుంచి ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి సైకిలు ఆపి వెనుకకితిరిగి చూశాము.

దాదాపు ఎనభైసంవత్సరాల వయసు ఉండే ముసలాయన,పరుగులాంటినడకతో దాదాపు వంద అదుగులదూరం నుండి మావైపేవస్తున్నాడు. కొంచెం దగ్గరకి వచ్చేసరికి పోల్చుకున్నాను. అతను సుబ్బయ్యతాత...........

........మా చిన్నప్పుడు మాస్కూలు దగ్గర ఉదయం పూట పిప్పరమెంటు బిళ్ళలు, ఉడికించిన వేరుశెనగకాయలు అమ్మేవాడు. టెంత్ క్లాస్ అయిపోయినతర్వాత మళ్ళీ తనని చూడడం ఇదే మొదటిసారి. దాదాపుగా పది సంవత్సరాల పైన అయిపోయింది. చాలకాలానికి మమ్మల్ని చూసిన ఆనందం అతని మొహంలో క్లియర్ గా కనిపిస్తోంది. వయసుతెచ్చిన అలసటవల్ల అనుకుంట కొద్దిపాటినడకకే ఒగరుస్తున్నాడు.

   ఒక్కసారిగ నాకుపాత సుబ్బయ్యతాత గుర్తుకువచ్చాడు.

...మా స్కూలుదగ్గర పిప్పరమెంటుబిళ్ళలు అమ్మే సమయానికే అతను చాలా పెద్దవాడు. కానీ చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడు.దాదాపు పది కిలోమీటర్లు దూరంలొ ఉండే వాళ్ళ ఇంటినుండి బుట్టలో సరుకులుపెట్టుకుని నడుచుకుంటూ మాస్కూలుదగ్గరకి వచ్చేవాడు.మమ్మల్ని అభిమానంగా చేరదీసి కబుర్లు చెప్పేవాడు. మేము తనదగ్గర ఏమైన కొనుక్కుని డబ్బులు ఇస్తే తీసుకునేవాడు లేకపోతే తనదగ్గర ఉన్నచిన్న పుస్తకంలొ అరువు రాసుకునేవాడు. అది ఎన్నాళ్ళకి తిరిగి మేము ఇచ్చినా అడిగేవాడుకాదు.నిజానికి అతను ఏనాడు డబ్బులు మిగుల్చుకోవడానికి వ్యాపారం చేసేవాడుకాదు.ఏదో గవర్నమెంటు ఆఫీసులో ప్యూను ఉద్యోగం చేసి రిటైరు అయ్యి, నెలనెలా వచ్చే పెన్షన్ ఇద్దరు కొడుకులకి సమానంగ పంచి ఇచ్చేస్తూ, నెలకి ఒకరిదగ్గర గడుపుకునేవాడు.ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూలుదగ్గర వ్యాపారం చేసుకుని సాయంత్రానికి ఇంటికి వెళ్తూ తర్వాతిరోజుకి సరుకులు కొనుక్కుని, మిగిలిన డబ్బులతో  తనకి లంక పొగాకు కాడలు, మనవలకి చిరుతిళ్ళూ కొనుక్కెళ్ళేవాడు.అంతవరకే అతనికి డబ్బు అవసరం. అంతకుమించి వచ్చే అవకాశం ఉన్నా అతను ఆశపడేవాడు కాదు...

   ఇన్నాళ్ళకి మమ్మల్ని చూసిన ఆనందంలో పావుగంట సేపు ఆపకుండా బోల్డు కబుర్లు చెప్పాడు.మాటలలో అతను వ్యాపారం మానివేసాడని ,ఇప్పుడు వేరే ఊరిలో  ఉంటున్నాడని అర్ధమైంది.

ఒక అరగంట కబుర్లుచెప్పుకున్న తర్వాత బయలుదేరుతూ కృష్ణ తాత చేతిలో ఏభైరూపాయలనోటు పెట్టాడు. అతని మొహం ఆనందంతో వెలిగిపోయింది.నేనుకూడా ఎమైనా ఇద్దాం అని జేబులో ఉన్న పర్సు బయటకి తీశాను. ఇందాకా ఏటిఎం లో విత్-డ్రా చేసిన వెయ్యిరూపాయలనోటు తప్ప చిన్నవి కనిపించలేదు.చూస్తూచూస్తూ అంత పెద్దనోటు ఇవ్వలేకపోయాను.చేసేది ఎమీలేక చిల్లరలేదు తాతా అన్నాను కొంచెం ఇబ్బందిగా మొహంపెట్టుకుని.పర్వాలేదులే బాబు, ఇప్పుడునాకు డబ్బులతో పనేముంటుంది,పొగాకుకాడలకి తప్ప. కృష్ణ ఇచ్చాడుకదా చాలులే అన్నాడు.కానీ ఆమాట అంటున్నప్పుడు అతని మొహంలో కనిపించిన చిన్నపాటి నిరాశ నాకళ్ళని దాటిపోలేదు. సరేనని తనకి విడ్కోలు చెప్పి మేము గోదావరివైపు బయలుదేరాము.కొద్ది దూరం వచ్చాముకానీ నామనసుకంతా వెలితిగా అనిపించింది. వెయ్యిరూపాయలు కొంచెం పెద్ద మొత్తమేకావచ్చు, కాని తాతకి ఇవ్వడంవల్ల నాకు పెద్దగా వచ్చే నష్టం ఎమీఉండదు. రోజూ చేసే ఎన్నో పిచ్చిఖర్చులతో పోలిస్తే ఇదేమీ అంతలెఖలోనిదీ కాదు.ఈ విషయంలొ అనవసరంగా లోభించానేమో అనిపించింది.ఇంక ఇలాకాదని సైకిలు ఆపి, కృష్ణని అక్కడే ఉండమని చెప్పి నేను వెనుకకి వెళ్ళాను ఆ డబ్బులు తాతకి ఇద్దాం అని. కాని అప్పటికే అతను అక్కడనుంచి వెళ్ళిపోయినట్లున్నాడు ఎంత వెతికినా నాకు కనిపించలేదు.నిర్ణయం తిసుకోవడంలొ చిన్నపాటి టైమింగ్ ప్రాబ్లం నాకు చాలా గిల్టిఫీలింగ్ మిగిల్చింది. ఇంక చెసేది ఎమీలేక వెనుకకి తిరిగివచ్చి , కృష్ణతోకలిసి గోదావరిఒడ్డుకి చేరుకున్నాను.





మాటజారితే

 ఒక్కొక్కసారి మనం అనుకొకుండానో, తీవ్రత అంచనా వెయ్యకుండానో మాటలు వదులుతూ ఉంటాం. తీరా మనతప్పు తెలుసుకునే సరికే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. తర్వాత తీరిగ్గా బాధపడడం తప్ప చెయ్యగలిగేది ఎమీఉండదు.
  మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభవమే నాకు ఎదురయ్యింది. ఎదోపనిఉండి మా కాలేజీకి వెళ్ళవలసి వచ్చింది.నా ఫ్రెండు కృష్ణని తోడుగా తీసుకుని వెళ్ళాను. పని పూర్తి అయ్యి బయటకి వచ్చేసరికి దాదాపు మధ్యాహ్నం అయ్యింది.మేము  రోడ్డుమీదకి వచ్చేసరికి మాడిగ్రీ క్లాస్-మీట్ శ్యామల ఎదురయ్యింది. అప్పటికి నేను తనని అఖరిసారి కలుసుకుని దాదాపు 5 సంవత్సరాలు అయ్యింది,మరలా ఇప్పుడే కలవడం. మమ్మల్ని చూస్తూనే స్కూటీ పక్కకి ఆపి మాదగ్గరకి వచ్చి నవ్వుతూ పలుకరించింది . ఒక పావుగంట కబుర్లు చెప్పినతర్వాత తాను ఇప్పుడు ఎదో కంప్యూటర్ కోర్సుచేస్తున్నానని, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నానని మరో ఐదు నిముషాలలో క్లాస్ స్టార్ట్ అవుతుంది కనుక మరొకసారి కలుస్తానని చెప్పి వెళ్ళిపోయింది.ఐదు సంవత్సరాలక్రితం కలిసినప్పుడు కూడా ఇలాగే ఎదో కోర్సు చేస్తున్నానని చెప్పింది.
     "ఇంక ఈఅమ్మాయి పెళ్ళి-పెటాకులు ఎమీ చేసుకొదేంట్రా, ఎంతసేపూ ఎదోఒక కోర్సు చెయ్యడం తప్ప..." అన్నాను నేను కృష్ణతో  ఒక్కొక్కసారి నాగొంతులో నాకుకూడా తెలియకుండా ధ్వనించే చిన్నపాటి వెటకారాన్ని నింపుకుని. కొంతసేపు వాడు ఎమీ మాట్లాడలేదు. తరవాత నెమ్మదిగా అన్నాడు. అలాకాదురా,ఎంతచదువుకున్నా ఎంత అందంగాఉన్నా ఆడపిల్ల పెళ్ళి చెయ్యాలంటే ఈరొజుల్లో కూడా లక్షలకిలక్షలు కట్నాలు ఇవ్వాలి. వీళ్ళ నాన్నేమో చిన్న సైకిలుషాపు నడుపుతాడు. మొన్ననే చాలా కష్టపడి వీళ్ళ అక్కకి పెళ్ళి చేసారు, ఈమెకికూడా చూస్తున్నారు. ఈమెది అయిపొతే వెనుక వీళ్ళ చెల్లి కూడాఉంది అన్నాడు. ఒక్కసారిగా నామాట ఆగిపోయింది. తిరిగి అలోచించి చూస్తే నేనెంత తొందరపడి మాట్లాడానో నాకు అర్ధమయ్యింది. ఆ గిల్టీ ఫీలింగ్ తోనే అనుకుంట కొంచెంసేపు మౌనంగాఉండిపొయాను.

  నెను మట్లాడడం అపేసరికి నా పరిస్థితిని కృష్ణ అర్ధంచెసుకున్నట్లున్నాడు  నాభుజం మీద చెయ్యి వేసి "అయినా అవన్ని నీకు నీకుమాత్రం ఎలా తెలుస్తాయి లేరా, నీకు చెల్లో అక్కో ఉండి ఉంటే తెలిసేది, నాకు కూడా మొన్న మా ఆక్క  పెళ్ళిలో ఈవిషయాలన్నీ కొంచెం అనుభవం లోకి వచ్చాయి,అందుకే అన్నారు పెళ్ళి చేసిచూడు, ఇల్లుకట్టి చూడు అని అర్ధం అయ్యిందా"  అన్నాడు నవ్వుతూ అనునయంగా .   ఇది జరిగిపోయి రెండునెలలు అయిపోయినా ఎప్పుడైనా గుర్తొస్తే కొంచెం బాధగాఅనిపించి మట్లాడేటప్పుదు ఒకటికి రెండుసార్లు అలోచించుకోవలసిన అవసరాన్ని నాకు గుర్తుచేస్తూ ఉంటుంది.

ఐస్-క్రీం బండి దుర్గారావు

రెండు నెలలక్రితం ఎదోపనిఉండి ఊరు వెళ్ళాల్సివచ్చింది. ఒక్కరోజు మాత్రమే శెలవుదొరకడంతో ఊరిలో దిగిన రోజే పని కంప్లీట్ అయ్యెలాగా ప్లాన్ చేసుకుని ఊళ్ళోదిగాను. అన్ని అనుకున్న ప్రకారమే కంప్లీట్ కావడంతో సాయంత్రం బండి క్యాచ్ చెయ్యడానికి తిరిగి స్టేషనుకి బయలుదేరాను. కృష్ణ నాతోపాటు వచ్చాడు నాకు సెండాఫ్ ఇవ్వడానికి. ఇంకా రైలుస్టార్ట్ అవ్వడానికి అరగంటకి పైగా టైము ఉండడంతో మేమిద్దరం అక్కడే స్టేషనులో నిలపడి మాట్లాడుకుంటున్నాం.ఇంతలో ప్లాట్-ఫారం మీద బండిమీద తిరుగుతూ ఐస్-క్రీము అమ్ముకుంటున్న ఇద్దరు పిల్లలు నాకు కనిపించారు. ఎక్కడో చూసినట్లనిపించింది. దగ్గరకి వచ్చాక బాగాపోల్చుకున్నాను. దుర్గారావు పిల్లలు వాళ్ళు. చటుక్కున దుర్గారావు గుర్తొచ్చాడునాకు.

   దుర్గారావు మాస్కూలుదగ్గర ఐస్-క్రీం బండి నడుపుకునేవాడు. రెండు రూపాయలు ఇస్తే పెద్ద బ్రెడ్డు-స్లైస్  మీద ఐస్-క్రీం పెట్టిఇచ్చేవాడు. సినిమాకబుర్లు బాగాచెప్పేవాడు. డబ్బులు లేనప్పుడు అరువు కూడా ఇచ్చేవాడు. మాకందరికి అతనంటే ఎందుకో కొంచెం అభిమానం ఉండేది.అప్పుడప్పుడు తనపిల్లల్ని కూడా తీసుకుని వచ్చేవాడు. మమ్మల్ని వాళ్ళకి చూపిస్తూ మీరుకూడా వీళ్ళలాగా బాగాచదువుకోవాలి అని చెప్పేవాడు. అప్పటికి వాళ్ళు బాగా చిన్నపిల్లలు.ఎమీ అర్ధంకానట్లు నవ్వేవాళ్ళు.ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళయ్యారు.

 " ..... ఆమధ్య జబ్బు చేసి దుర్గారావు సడన్ గా పోయాడురా, దానితో వీళ్ళకి చదువుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకే వాళ్ళ నాన్న వ్యాపారాన్నే కలిపి చెసుకుంటున్నారు.." అన్నాడు కృష్ణ . అప్పుడు గమనించానువాళ్ళని, పెద్దవాడు కొంచెం బలంగా,పొడుగ్గా ఉన్నాడు. కాని పాపం వాడికి కళ్ళు సరిగ్గా కనపడవనుకుంట, పెద్దపెద్ద సోడాబుడ్డి కళ్ళాద్దాలు వేసుకుని ఉన్నాడు. రెండో వాడికి అన్నీ బాగానే ఉన్నాయి గాని వాడు బక్కగా పొట్టిగా ఉన్నాడు.కాని వాళ్ళిద్దరు కలిపివ్యాపారం చేసుకుంటున్న పద్ధతిచూస్తే నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఇద్దరు కలిపి నడుపుకోవడానికి వీలుగా సైకిలుకి రెండుసీట్లు పెట్టించారు. పెద్దవాడు వెనుక కూర్చుని  పెడల్ తొక్కుతుంటే, చిన్నవాడు ముందుసీట్లో కూర్చుని హేండిల్ బార్ చూసుకుంటున్నాడు.

  వాళ్ళకేదైనా సాయం చెస్తే బాగుంటుందేమో అనిపించిందినాకు. కృష్ణ ఆపాడునన్ను. కష్టమోనష్టమో వాళ్ళజీవితాలు ఒకపద్దతిలో వాళ్ళుగడుపుతున్నారు.. ఇప్పటివరకు అప్పుకోసంకూడా ఎవరిదగ్గర చెయ్యిచాపినట్లు కూడా నేను చూడలేదు. నాకుతెలిసి నువ్వుఇచ్చినా వాళ్ళు తీసుకోరు అన్నాడు. సరేఅయితే ఎంచేద్దాం అన్నాను. రెండు ఐసులు కొను వాళ్ళదగ్గర,అది చాలు వాళ్ళకి మనం కూడా పుల్ల ఐసులు తినిచాలాకాలం అయినట్లుంది అన్నాడు నవ్వుతూ . ఇంతలో రైలు బయలుదేరుతున్నట్లు ఎనౌన్సుమెంటు రావడంతో నేను వాళ్ళని దగ్గరకిపిలిచి రెండు ఐస్-ఫ్రూట్లు కొని ఒకటి కృష్ణకి ఇచ్చి వీడ్కోలుచెప్పి రైలు ఎక్కాను.

శుక్రవారం, మార్చి 28, 2014

తెలుగుతెరపైకి దూసుకువస్తున్న కొత్త గాయకుడు.



తెలుగుతెరకి ఈమధ్యనే విడుదలయిన శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రం ద్వారా సరికొత్త గాయకుడు పరిచయం అయ్యాడు. పిట్టకొంచెం కూతఘనం అనిపిస్తున్న ఆగాయకుడి వయసు కేవలం ఇరయైరెండేళ్ళే.


అతనిపేరు :    శ్రీపతి పండితారాధ్యుల  బాలసుబ్రహ్మణ్యం

క్లుప్తంగా :     ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని,

ముద్దొచ్చినప్పుడు :  (కొందరికి మాత్రమే) "బాలు" అనికూడా పిలువవచ్చు.




ఆదివారం, ఫిబ్రవరి 23, 2014

సూది, సిరంజీ ఇంకా నేను నాఫ్రెండ్సు


   అసలిప్పుడైతే డాక్టరు అవ్వడానికితెగ కష్టపడిపోతున్నారుగాని ,డాక్టర్ కావడానికి సుళువైనదారి నేను చిన్నప్పుడే కనిపెట్టేశాను.తాతగారి ఊరు వెళ్ళినప్పుడు నేను కనిపెట్టిన ఫార్ములా మావయ్యలకిచెబితే వాళ్ళు బోల్డంత త్రిల్లైపోయారు. నా ఫార్ములా ప్రకారం డాక్టరు అవ్వడానికి ఎంబిబియస్  చదవవలసిన అవసరం లేదు. మనకి అప్పుడప్పుడు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకి వెళ్తాము కదా,ఇక్కడ డాక్టర్ అంటే సూరిబాబు తాతయ్య అన్నమాట. అప్పుడు సూరిబాబు తాతయ్య ఏంచేస్తాడు మనంచెప్పినవన్నీవిని తర్వాత మనచెయ్యి పట్టుకుని చూసి ఈమందులు వాడించండి అని చీటీమీద మందుల లిష్టు రాసి నాన్నకి ఇస్తాడు కదా. అప్పుడు మనం మందులుతెచ్చుకుని వాడేసి, జ్వరం తగ్గిపోయినతర్వాత ఆ మందుల చీటీ దాచేసుకున్నామనుకోండి, మనకి  జ్వరానికి ఏమందులు వాడాలో తెలిసిపోయినాఅట్లేకదా...

అలాగే కడుపునొప్పివచ్చిందని, తలపోటువస్తోందని సూరిబాబు తాతయ్యకి అబద్దంచెప్పి మందులచీటీలు తెచ్చేసుకున్నామనుకోండి ఏరోగాలకి ఏమందులువాడాలో మనకి తెలిసిపోతుంది,అప్పుడు మనమే డాక్టరు అయిపోవచ్చు , అది నాప్లాను. ఊరినుంచి తిరిగివచ్చినతర్వాత స్కూలులో జంధ్యాలగాడికి, వేమూరి శివకి ఇంకా బూర్ల ఫణి గాడికి నా ప్లాను చెప్తే వాళ్ళంతా వాళ్ళుకూడా థ్రిల్ అయిపోయారు. ఇంక ఆరోజునుంచి మేమందరం కలిసి మందుల చీటీలు సంపాదించడం మొదలుపెట్టాము. ఇంక అరోజు నుంచి మానలుగురిపని ఒకటే, తెలిసినవాళ్ళలో గానీ, చుట్టాలలోగానీ ఎవరికైనా ఏదైన రోగం వచ్చింది అని తెలియడంపాపం వాడిదగ్గవాలిపోయి వాడికి వచ్చిన రోగం ఏంటి దానికి వాడువాడినమందులు ఏంటి అని కూపీలాగి అవన్నీ ఒక నోటుపుస్తకంలో రాసేసుకునేవాళ్ళం. ఇలాకొన్నిరోజులు గడిచిఫోయాయి.మాపుస్తకం బాగానే నిండుతోంది.అప్పుడప్పుడు మేమంతా కూర్చుని హాస్పటలు ఎలానడపాలి, పేషంట్లని అంటా మనదగ్గరకే రావాలంటే ఏంచెయ్యాలి అనేవిషయాలని తీవ్రంగా చర్చించేవాళ్ళం. చాలారోజులు చర్చించిన తర్వాత ఒక ప్రొటోకాల్ తయారుచేశాము. దానిప్రకారం, "....పేషంటు హాస్పటల్లోకి రాగానే ముందుగా వాడికి వచ్చినరోగం ఏంటో వాడినే అడగాలి, తర్వాత వాడి చెయ్యి అడిగితీసుకుని మణికట్టుదగ్గర మునివేళ్ళతో  కొంచెంసేపు పట్టుకుని కళ్ళుమూసుకోవాలి. ఎందుకో నాకూతెలీదు
కానీ సూరిబాబుతాతయ్య ఎప్పుడూ అలాగే చేస్తాడు, అందుకే నేనుకూడా అలాగేచెయ్యాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు ఇంక వాడిరోగం ఎమిటోమనకి తెలిసిపోయింది కనుక వాడు చూడకుండా మనపుస్తకం ఓపెన్ చేసి అందులో వాడికివచ్చిన రోగానికి ఏమందు ఉందోచూసేసి అది వాడికి వేరే చీటీమీద రాసిచ్చేస్తే సరిపోతుంది అంతే".

   "ఒక్కమందుల చీటీలేయిస్తే సరిపోదురా అప్పుడప్పుడు ఇంజక్షనులు కూడా ఇవ్వాలి అప్పుడే మంచి డాక్టర్ అవుతాం" అన్నాడు జంధ్యాల. అదీనిజమే అన్నట్లు ఫణి, శివ వాడిని సపోర్టు చేశారు.ఆలోచించి చూస్తే వాళ్ళు చెప్పిందికూడా నిజమే అనిపించింది. ఇంజక్షను చెయ్యాలంటే సూది, సిరంజీ ఉండాలి కదా ఇప్పటినుంచే అవన్నీ అముర్చుకుంటే అప్పుడప్పుడు ప్రాక్టీసు చెయ్యచ్చుకదా అనిపించింది. మాఅత్త వేరేఊళ్ళో హెల్త్ డిపార్ట్మెంటులో పనిచేసేది. అప్పుడప్పుడు శెలవలకి తనుఇంటికి వచ్చేస్తుందికదా అప్పుడు తను బయలుదేరేముందునాకు ఫోనుచేసి ఎంతీసుకురాను అని అడుగుతుంది కదా, అప్పుడునేను నాకు సిరంజి-సూది కావాలి అని అడిగాను. ఎప్పుడూ స్వీట్లు కావాలి,చాక్లెట్లు కావాలి అనిఅడిగే నేను ఈసారి కొత్తకోరిక కొరేసరికి అడిగేసరికి కొంచెం ఆశ్చర్యపోయినా తర్వాతరోజుకి నేనడిగినవాటితోపాటు స్వీట్లు కూడాతెచ్చింది. తను ఇంట్లోకి అడుగుపెట్టడమే ఆలశ్యం నేనుతన బ్యాగుమీద దాడిచేసాను నాక్కావలసినవాటికోసం. సిరంజి తెచ్చింది గాని దానికిసూదిలేదు. "ఆ సూది ఎవరికైన గుచ్చుకుందంటే లేనిపోని గొడవలు సిరంజితో ఆడుకో చాలు" అంది అత్త నావైపు చూస్తూ. నేను ఏడుపుమొహం పెట్టానుగానీ తనేమీపట్టించుకోలేదు. సూదిలేని సిరంజితో ఎలా ప్రాక్టీసుచెయ్యడమో నాకు అర్ధంకాలేదు. ఆమొండి సిరంజి నాకు కిరీటంపోగొట్టుకున్న మహారాజులాగా కనిపిస్తోంది.  దానికి ఎలగైనా కిరీటం సంపాదించాలని ఆక్షణంలో నేను నిర్ణయించుకున్నాను.

     తాతగారి ఊరులో సూరిబాబు తాతయ్య ఉన్నట్లే మాఊరికి కూడా ఒక సూరిబాబు తాతయ్య ఉన్నాడు. ఆయనపేరు సాంబమూర్తి తాతయ్య . చెప్పానుకదా సూరిబాబు తాతయ్య అంటే డాక్టరని.  సాంబమూర్తి తాతయ్య దగ్గరకూడా సూదిసిరంజి ఉండేవి. ఆయనదగ్గర ఒక చిన్న అల్యుమినియం రేకుపెట్టే ఉండేది. దానిలో ఆయన అరచేతిమందంగా దూది పరిచి, దానిమీద చీర ఉయ్యాలలో పాపాయిని పడుకో పెట్టినంత జాగ్రత్తగా సూదిసిరంజి పెట్టుకుని మళ్ళీ దానిపైన  ఒక పొర దూదిపరిచేవారు. ప్రతీఆదివారం ఆయన నాన్నతో కబుర్లుచెప్పడానికి ఇంటికివచ్చేవారు.  ఆవారం ఇంటికివచ్చినప్పుడు నేను ఆయన పక్కనేచేరాను. ఒక్కక్షణం అవకాశంవస్తే ఆపెట్టెలోంచి సూదికొట్టేయ్యాలని నాప్లాను. ఆయనకేదో అనుమానం వచ్చినట్లుంది నేను పక్కనచేరడంచూసి పెట్టెఉన్నబ్యాగుని తీసుకుని ఒళ్ళోపెట్టుకున్నారు. నాప్రాణం ఉసూరుమంది. ఈలోపు నాటైంకలిసివచ్చి అమ్మ టిఫినుతీసుకునివచ్చింది.వాళ్ళు టిఫినుచేసి చేతులు కడుక్కోవడానికి పెరట్లోకివెళ్ళిన గ్యాపులో ఆయన పెట్టేలోంచి సిరంజిలేపేసి క్షణంలో అక్కడనుంచి మాయమయిపోయాను.

 తర్వాతిరోజు స్కూలుకివెళ్ళి నాముగ్గురు ఫ్రెండ్సుకి కిరీటంతోకూడిన సిరంజిని చూపిస్తే వాళ్ళు నన్ను తెగమెచ్చేసుకున్నారు. ఇంక అప్పుడు అసలుకథ మొదలయ్యింది.  సూది-సిరంజీ ఎదోఒకలాగా సంపాదించాం గాని పొడవడం ప్రాక్టీసుచెయ్యడానికి ఒక పర్సనాలిటీ కావాలికదా, ఎలాగా అని ఆలోచిస్తుంటే  శివ ముందుకి వచ్చాడు ఇంజక్షను చేయించుకోవడానికి. దానికి ప్రతిఫలంగా మేముప్రతీరోజూ  స్కూలుఇంటర్వెల్లో కొనుక్కుని పంచుకునే చాక్లెట్లలో మేజరువాటాతనకి ఇచ్చే ఒప్పందమ్మీద.  ఇంతలో మాక్లాసులో ఎదో కలకలం మొదలయ్యింది. ముందు బెంచీలో కూర్చునే రాకేషుగాడి లెక్కలు పుస్తకం ఎవరో దొంగతనం చేసారుట. మాష్టారు క్లాసులో అందరి బ్యాగులు వెతకమన్నారు. లెక్కలపుస్తకం దొరకలేదుగాని నా బ్యాగులో సిరంజి దానికీరీటం మాత్రం ఆయన కంటపడిపోయాయి. ఆయన పెద్ద డిటెక్టివ్ లాగా అవి ఇక్కడకి ఎందుకువచ్చాయో ఆరాతీసి తర్వాత పేక బెత్తంతో నన్ను నాఫ్రెండ్సుని ఏకేసి ఇంకాచాలదన్నట్లు సాయంత్రం తిన్నగా ఇంటికివచ్చి "మీవాడండీ...."  అంటూ అమ్మానాన్నలకి ఆవిషయం చెప్పేసారు. నాఖర్మకాలి అదేటైముకి సాంబమూర్తి తాతయ్యకూడా ఇంటిదగ్గరే ఉన్నారు. ఆయన నావైపు కోపంగా చూస్తూనే తప్పిపోయిదొరికిన పిల్లవాడిని దగ్గరకి తీసుకున్నంత అపురూపంగా సూదిని నాదగ్గరనుంచి తీసుకుని ఆయన పెట్టెలో దాచేసుకున్నారు. ఇంక తర్వాత స్కూలు దగ్గర అయిపోయిన బాదుడు కార్యక్రమం ఇంటిదగ్గర కంటిన్యూ అయ్యింది.  ఆదెబ్బకి మేము డాక్టరు కార్యక్రమాలన్నీ పెద్దయిన తర్వాతకి వాయిదావేసుకుని మాసాధారణ కార్యక్రమాల్లో మునిగిపోయాం.