సోమవారం, జులై 28, 2014

తులసీదళం అనబడే ఒక కాష్మోరా కథ



అనగా అనగా ఒక పాప, పేరు తులసి. ముద్దుగా,బొద్దుగా ఉంటుంది(ట). ఆ పాపకి ఒక అమ్మా,నాన్న. పేరు శ్రీధర్, శారద. వాళ్ళకి బోల్డంత డబ్బు ఉంది. అయితే అదంతా తులసీవాళ్ళ నాన్న సంపాదినంచిదికాదు, కొంచెం ఆయన సంపాదిస్తే మిగిలినది వాళ్ళ కంపేనీ యజమాని(విదేశీయుడు) ముసలితనంతో తనదేశానికి వెళ్ళిపోతూ,వెళ్ళిపోతూ శ్రీధర్ మీద అభిమానంతో తను మనవరాలిలా భావించే తులసి పేరుమీద రాసినది. అయితే రాసేఆయనేదో తిన్నగా రాయచ్చుకదా, అలారాసేస్తే కిక్కేముంటుంది అనుకున్నాడేమో ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టాడు. తులసికి పదేళ్ళ వయసు వచ్చాక మాత్రమే ఆ డబ్బుకి తను హక్కుదారు అవుతుంది, ఇంతలోపు జరగరనిది ఎదైనా  తులసికి జరిగితే ఆ డబ్బంతా
ఒక అనాధ శరణాలయానికి చెందుతుంది. ఇదీ ఇక్కడ మెలిక. తులసికి పదేళ్ళు రావడానికి రెండునెలల ముందరవరకూ అంతా బానేఉంటుంది, తర్వాతే అసలు కథ మొదలవుతుంది. తులసిని అడ్డంతొలగించుకుంటే ఆస్తిమొత్తం కాజెయ్యచ్చు కదా అని అనాధశరణాలయం  వాళ్ళు కుట్ర చేస్తారు.తులసిని కత్తో,తుపాకినో పెట్టి చంపేయ్యచ్చు , కానీ అలాచేస్తే లాజిక్ ప్రకారం మొదట అనుమానం  వచ్చేది అనాధశరణాలయం  వాళ్ళ మీదే కనుక సేఫ్ గేం అడదాం అనుకుంటారు. బాగా అలోచించి,అలోచించీ పాపని క్షుద్రశక్తుల సాయంతో చంపుదాం అని నిర్ణయించుకుని ఒరిస్సా బయలుదేరి వెల్తారు. ఎందుకంటే అక్కడే కిలో బియ్యానికి కూడా మర్డర్లు చేసే మంత్రగాళ్ళు ఉంటారు(ట). అక్కడికి వెళ్ళి కాద్రా అనే మంత్రగాడిని పట్టుకుని వాడిసాయంతో పాపని చంపడానికి ప్రయత్నిస్తారు. తీరా చిన్నపిల్లని చంపడానికి కాద్రా ఒప్పుకోకపోవడంతో నిరాశగా తిరిగివస్తుంటే దారిలో   కాద్రా

శిష్యుడు ఒకడు తగిలి తాను ఆపని చెయ్యడానికి ఒప్పుకుని పాపకి చేతబడి చెయ్యడం మొదలు పెడతాడు. పని మొదలుపెట్టాక తులసికి అనారోగ్యం రావడంతో అసలు కథ మొదలవుతుంది. ఇంక అక్కడినుంచీ కథ రకరకాల మలుపులు తిరుగుతూ అనూహ్యంగా చేతబడి మంత్రాలు రివర్స్ కొట్టి కాద్రా శిష్యుడు  చచ్చిపోవడంతో అవేశంగా కాద్రాయే రంగంలోకి దిగుతాడు. అక్కడినుంచీ కథ ఇంకోమలుపు తిరుగుతుంది. అవేశంతో ఉన్నకాద్రా చిన్నాచితకా శక్తుల్ని కాకుండా మంత్రవిద్యలలో అతిభయంకరమయినది అయిన "కాష్మోరా" అనబడే భయంకరమైన క్షుద్ర శక్తిని పిచుకపై బ్రహ్మాస్త్రం లాగా తులసిమీద ప్రయోగిస్తాడు.  ప్రయోగం మొదలుపెట్టినరోజునుంచీ 21 రోజులపాటు ఆ కాష్మోరా తన టైం-టేబుల్ లో ఉన్న లిస్టు ప్రకారం పాపని రకరకాల రోగాలకి గురిచేస్తూ 21రోజు అర్ధరాత్రి దారుణంగా చంపెయ్యాలి. ఇంక అక్కడనుంచీ ప్రతిరోజూ పాపకి ఎదోఒక రోగమే. పాపావాళ్ళ అమ్మకీ, ఇంకా వాళ్ళింట్లో పనిచేసే ముసలిపనివాడికి ఇదేదో మంత్రగాళ్ళ పని అయిఉండవచ్చి అని అనుమానంవస్తుంది కానీ, పాపావాళ్ల  నాన్నారేమో ఇలాంటివి నమ్మడు. అందుకనీ పాపని హాస్పటళ్ళ చుట్టూ తిప్పుతూ తను ఏడుస్తూ ఇంట్లోవాళ్ళందరినీ ఏడిపిస్తూ చివరిరోజువరకూ గడిపేస్తాడు. ఇంకమరికొద్ది గంటలలో పాప చచ్చిపోతుందనగా రియలైజ్ అయ్యి ఒక ఫకీర్ ఇచ్చిన మంత్రదండం పట్టుకుని మనల్నందరినీ టెన్షన్ పెడుతూ కారులో ఒరిస్సావెళ్ళి కాద్రాని చంపేసి కూతుర్ని రక్షించుకుంటాడు. అదీకథ. కథముందుకునడిపే క్రమంలో అసలు క్షుద్రవిద్యలంటే ఏమిటి, చేతబడిలాంటి ప్రయోగాల్ని ఎలాచెయ్యచ్చు అనేవిషయాల్ని మనందరికీ చాలాసుళువుగా అర్ధమాయ్యేలాగ వివరిస్తాడు రచయిత.

         మొత్తం పుస్తకం చదవడం పూర్తయిన తరువాత నాకు అనిపించిందేమిటంటే "అసలు ఆ అమెరికావాడికి బుద్ధిలేదు....", అవును నిజంగానే లేదు. లేకపోతే చంపడానికి ఇంత ఈజీ పద్దతులుండగా ఆ లాడెన్ గాడిని చంపడానికి అన్ని బిలియన్లు ఖర్చు పెట్టాలా , చక్కగా మనదేశం వస్తే రాచమర్యాదలతో ఒరిస్సా తీసుకుని వెళ్ళి  ఇంకో కాద్రానో ,లేకపోతే బాద్రానో పరిచయంచేసేవాళ్ళంకదా. అప్పుడు పదోపాతికోఖర్చుపెడితే సరిపోయేది. కాకపోతే ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఒకసారి కాష్మోరాని ప్రయోగించిన తరువాత,ఎవరిమీదయితే  ప్రయోగించారో వాళ్ళనోటిలో ప్రతిరోజూ అర్ధరాత్రి 12.00 గంటలకు మూడు రక్తంచుక్కలు వెయ్యాలి,లేకపోతే ప్రయోగం తిరగబడే ప్రమాదం ఉంది. అంటే అమెరికావాడు ఎవరైనా తనమనిషిని లాడెన్ వాళ్ళింట్లో పెట్టుకుని, వాడి నోటిలో సరిగ్గా అర్ధరాత్రి 12.00 గంటలకు మూడు రక్తంచుక్కలు వేయించాలి. ఇప్పుడు అలాంటి మనిషెక్కడ దొరుకుతాడు. ఒకవేళ దొరికినా ఇక్కడా ఇంకో చిక్కు ఉంది. సదరు లాడెన్ అనబడేవాడు సుఖపురుషుడు. అంటే మనవాడికి దాదాపుగా నలుగురైదుగురు భార్యలు ఉన్నారు. ఏరాత్రి ఏభార్యగదిలో ఉంటాడో చెప్పలేం. ఒకరాత్రంతా ఒకభార్య గదిలోనేఉంటాడోలేదోకూడా చెప్పలేం. కనుక ఇలాంటి బాధలన్నీ నెత్తిమీద పెట్టుకోవడం ఎందుకు అనుకున్నాడోఎమో డైరెక్టుగా విమాలేసుకుని యుద్దానికే వెళ్ళాడు. ఇవన్నీ అలోచించిన తరువాత ఎంతైనా అమెరికావాడే నాకంటే తెలివైనవాడు అనిపించింది.

      ఇంక అమెరికావాడి సంగతి పక్కనపెట్టి, నావిషయానికి వస్తే హాయిగా చందమామకథలు, మంచిమంచి ఆటో-బయోగ్రఫీలు చదువుకునే నేను, వాడెవడో సజష్టు చేశాడనిచెప్పి ఈ దెయ్యాల,కాష్మోరాల కథలు చదివి, ఆ హేంగోవరుతో రాత్రుళ్ళు నిద్రపట్టక నన్ను ఆ బుక్కు చదవమని చెప్పినవాడిని నోటినిండా తిట్టుకుంటూ రెండురోజులు గడిపి మూడవరోజు రాత్రిపడుకునేడప్పుడు ఆంజనేయస్వామి సింధూరం పేట్టుకుని పడుకోవలసి వచ్చింది. ఇలాంటి పుస్తకాలు మరికొన్ని మార్కెట్లోకి వస్తేచాలు, చిల్లరమంత్రగాళ్ళకి, బాబాలకి బోల్డంతపని, కావలసినంత డబ్బు. కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి, పుస్తకం చదువుతున్నంతసేపూ పాపకి ఎమీజరగదని తెలుస్తున్నా, టెన్షన్ తగ్గకుండా ఆసాంతం చదివించడంలో రచయిత వందశాతం విజయం సాధించాడు.