శనివారం, ఏప్రిల్ 05, 2014

సుబ్బయ్యతాత

మూడు సంవత్సరాల తరువాత మళ్ళీ మాఊరువచ్చాను. ఉద్యోగం కోసం దాదాపు ఆరు సంవత్సరాలక్రితం ఊరువిడిచి వెళ్ళినప్పటినుండి ఏడాదికి ఒకసారయినా ఎదోఒకవంకతో ఇక్కడికి వచ్చేవాడిని కానీ గత మూడు సంవత్సరాలుగా  వీలుచిక్కటంలేదు. బహుశా ప్రయత్నలోపంకావచ్చు. కానీ ఎందుకో పోయినవారం ఒక్కసారిగా ఊరిమీద  బోల్డంతప్రేమ పుట్టుకొచ్చింది. ఒకసారి అందరిని చూడాలనిపించింది.అనిపించడమేతడవు వెంటనే టిక్కెట్టు రిజర్వ్ చేయించుకుని బయలుదేరి వచ్చేశాను.రైలుదిగితూనే సరాసరి ఊర్లోనే ఉంటున్న మాపెదనాన్నగారింటికి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే రెష్టు తీసుకుని కొంచెం చల్లపడ్డాక సైకిలు మీద ఎంబరుమన్నారు స్వామి కోవెలకి బయలుదేరాను.ఎంబరుమన్నారుస్వామి అంటే తమిళంలో వెంకటేశ్వరస్వామి. ఆ గుడిని తమిళాయన కట్టించినందువల్ల తమిళనామంతోనే పిలుస్తారు. నాస్నేహితుడు కృష్ణ అక్కడే అర్చకత్వం చేస్తున్నాడు. నేను వేళ్ళేసరికి అక్కడ స్వామివారికి అభిషేకం చేస్తున్నాడు.దూరం నుంచి నన్నుచూస్తూనే పలకరింపుగానవ్వి కూర్చోఅక్కడ వస్తున్నా అన్నట్లు సైగ చేసాడు.నేను స్వామివారిని దర్సించుకుని ధ్వజస్తంభానికి పక్కగాఉన్నమంటపంలో కూర్చున్నాను.ఒక పావుగంటలో వచ్చాడు అభిషేకం అయిపోయినతర్వాత. అరిటాకులో తెచ్చిన  గోరువెచ్చని అప్పాలు,చెక్కరపొంగలి నాచేతిలో పెట్టాడు. తనకితెలుసు అవంటే నాకుచాలా ఇష్టంఅని.... తెస్తాడని నాకూతెలుసు.

                 "ఇంతకాలానికి మళ్ళీ మేము గుర్తొచ్చామన్నమాట.." అన్నాడు నవ్వుతూ నాపక్కన కూర్చుని.

                 నేనేమీ సమాధానం చెప్పలేదునవ్విఊరుకున్నా.

పదినిముషాలు కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇద్దరంకలిసి గోదావరిఒడ్డుకి బయలుదేరాము.
సైకిలుమీద కోవెలనునంచి రెండువీధులు దాటి దాదాపు జ్యోశ్యులవారి వీధివరకు వచ్చేశాము, వెనుకనుంచి ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి సైకిలు ఆపి వెనుకకితిరిగి చూశాము.

దాదాపు ఎనభైసంవత్సరాల వయసు ఉండే ముసలాయన,పరుగులాంటినడకతో దాదాపు వంద అదుగులదూరం నుండి మావైపేవస్తున్నాడు. కొంచెం దగ్గరకి వచ్చేసరికి పోల్చుకున్నాను. అతను సుబ్బయ్యతాత...........

........మా చిన్నప్పుడు మాస్కూలు దగ్గర ఉదయం పూట పిప్పరమెంటు బిళ్ళలు, ఉడికించిన వేరుశెనగకాయలు అమ్మేవాడు. టెంత్ క్లాస్ అయిపోయినతర్వాత మళ్ళీ తనని చూడడం ఇదే మొదటిసారి. దాదాపుగా పది సంవత్సరాల పైన అయిపోయింది. చాలకాలానికి మమ్మల్ని చూసిన ఆనందం అతని మొహంలో క్లియర్ గా కనిపిస్తోంది. వయసుతెచ్చిన అలసటవల్ల అనుకుంట కొద్దిపాటినడకకే ఒగరుస్తున్నాడు.

   ఒక్కసారిగ నాకుపాత సుబ్బయ్యతాత గుర్తుకువచ్చాడు.

...మా స్కూలుదగ్గర పిప్పరమెంటుబిళ్ళలు అమ్మే సమయానికే అతను చాలా పెద్దవాడు. కానీ చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడు.దాదాపు పది కిలోమీటర్లు దూరంలొ ఉండే వాళ్ళ ఇంటినుండి బుట్టలో సరుకులుపెట్టుకుని నడుచుకుంటూ మాస్కూలుదగ్గరకి వచ్చేవాడు.మమ్మల్ని అభిమానంగా చేరదీసి కబుర్లు చెప్పేవాడు. మేము తనదగ్గర ఏమైన కొనుక్కుని డబ్బులు ఇస్తే తీసుకునేవాడు లేకపోతే తనదగ్గర ఉన్నచిన్న పుస్తకంలొ అరువు రాసుకునేవాడు. అది ఎన్నాళ్ళకి తిరిగి మేము ఇచ్చినా అడిగేవాడుకాదు.నిజానికి అతను ఏనాడు డబ్బులు మిగుల్చుకోవడానికి వ్యాపారం చేసేవాడుకాదు.ఏదో గవర్నమెంటు ఆఫీసులో ప్యూను ఉద్యోగం చేసి రిటైరు అయ్యి, నెలనెలా వచ్చే పెన్షన్ ఇద్దరు కొడుకులకి సమానంగ పంచి ఇచ్చేస్తూ, నెలకి ఒకరిదగ్గర గడుపుకునేవాడు.ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూలుదగ్గర వ్యాపారం చేసుకుని సాయంత్రానికి ఇంటికి వెళ్తూ తర్వాతిరోజుకి సరుకులు కొనుక్కుని, మిగిలిన డబ్బులతో  తనకి లంక పొగాకు కాడలు, మనవలకి చిరుతిళ్ళూ కొనుక్కెళ్ళేవాడు.అంతవరకే అతనికి డబ్బు అవసరం. అంతకుమించి వచ్చే అవకాశం ఉన్నా అతను ఆశపడేవాడు కాదు...

   ఇన్నాళ్ళకి మమ్మల్ని చూసిన ఆనందంలో పావుగంట సేపు ఆపకుండా బోల్డు కబుర్లు చెప్పాడు.మాటలలో అతను వ్యాపారం మానివేసాడని ,ఇప్పుడు వేరే ఊరిలో  ఉంటున్నాడని అర్ధమైంది.

ఒక అరగంట కబుర్లుచెప్పుకున్న తర్వాత బయలుదేరుతూ కృష్ణ తాత చేతిలో ఏభైరూపాయలనోటు పెట్టాడు. అతని మొహం ఆనందంతో వెలిగిపోయింది.నేనుకూడా ఎమైనా ఇద్దాం అని జేబులో ఉన్న పర్సు బయటకి తీశాను. ఇందాకా ఏటిఎం లో విత్-డ్రా చేసిన వెయ్యిరూపాయలనోటు తప్ప చిన్నవి కనిపించలేదు.చూస్తూచూస్తూ అంత పెద్దనోటు ఇవ్వలేకపోయాను.చేసేది ఎమీలేక చిల్లరలేదు తాతా అన్నాను కొంచెం ఇబ్బందిగా మొహంపెట్టుకుని.పర్వాలేదులే బాబు, ఇప్పుడునాకు డబ్బులతో పనేముంటుంది,పొగాకుకాడలకి తప్ప. కృష్ణ ఇచ్చాడుకదా చాలులే అన్నాడు.కానీ ఆమాట అంటున్నప్పుడు అతని మొహంలో కనిపించిన చిన్నపాటి నిరాశ నాకళ్ళని దాటిపోలేదు. సరేనని తనకి విడ్కోలు చెప్పి మేము గోదావరివైపు బయలుదేరాము.కొద్ది దూరం వచ్చాముకానీ నామనసుకంతా వెలితిగా అనిపించింది. వెయ్యిరూపాయలు కొంచెం పెద్ద మొత్తమేకావచ్చు, కాని తాతకి ఇవ్వడంవల్ల నాకు పెద్దగా వచ్చే నష్టం ఎమీఉండదు. రోజూ చేసే ఎన్నో పిచ్చిఖర్చులతో పోలిస్తే ఇదేమీ అంతలెఖలోనిదీ కాదు.ఈ విషయంలొ అనవసరంగా లోభించానేమో అనిపించింది.ఇంక ఇలాకాదని సైకిలు ఆపి, కృష్ణని అక్కడే ఉండమని చెప్పి నేను వెనుకకి వెళ్ళాను ఆ డబ్బులు తాతకి ఇద్దాం అని. కాని అప్పటికే అతను అక్కడనుంచి వెళ్ళిపోయినట్లున్నాడు ఎంత వెతికినా నాకు కనిపించలేదు.నిర్ణయం తిసుకోవడంలొ చిన్నపాటి టైమింగ్ ప్రాబ్లం నాకు చాలా గిల్టిఫీలింగ్ మిగిల్చింది. ఇంక చెసేది ఎమీలేక వెనుకకి తిరిగివచ్చి , కృష్ణతోకలిసి గోదావరిఒడ్డుకి చేరుకున్నాను.





2 కామెంట్‌లు:

ranivani చెప్పారు...

బావుంది .గోదావరి ఒడ్డు, గుడి ,ప్రసాదాలు,స్నేహితుడే అర్చకుడు,అంతా భలేగా ఉంది ,సినిమాలో చూస్తున్నట్టు.తాతను పట్టుకుని డబ్బులు ఇచ్చి ఉంటే ఇంకా బావుండేది.

నాగశ్రీనివాస చెప్పారు...

@nagarani garu: అవునండి ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ కుదరలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి