సోమవారం, ఏప్రిల్ 07, 2014

గోదావరి-గవర్రాజు






గోదావరి- ఎక్కడో మహారాష్ట్రలో గోముఖం నుంచి చిన్నధారగా పుట్టి,మనరాష్ట్రంలోని రాజమండ్రివరకు అఖండగోదావరిగా ఉరుకులు పెట్టుకుంటూ ప్రవహించి,అక్కడినుంచి ఏడుపాయలుగా విడిపోయి ఉభయ గోదావరిజిల్లాలని సస్యశ్యామలం చేస్తూ సముద్రంలో కలిసిపోతుంది...రేవు నావలు నడిపేవారి దగ్గరనుంచి పెద్దపెద్ద పంట్లు నడుపుకునే వాళ్ళవరకు , చిన్నచిన తెప్పలలొ చేపలు పట్టుకునే వారి నుంచి మరపడవలలొ వేటకి వెళ్ళేవారి వరకు ఎందరికో ఈనది జీవనాధారం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసుకుని అలసిపోయిన శ్రమజీవులకి అది ఒక రీఫ్రెష్మెంట్ స్పాట్.చిన్నదైన మానరసాపురం మొత్తమ్మీద మోష్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అది.

   అక్కడే నాకొకసారి గవర్రాజు పరిచయం అయ్యాడు. చేపల వ్యాపారం చేసేవాడు. తెల్లవారుఝామునే పడవ వేసుకుని గోదావరి మధ్యలోకి వెళ్ళి వలలు పాతి,రాత్రి తిరిగి వెళ్ళి వలలో పడిన చేపలని తెచ్చుకుని మర్నాడు మార్కెట్ లో అమ్ముకునేవాడు.అప్పుడప్పుడు నేనుకూడా అతనితో కలిపి రాత్రి పడవలో వెళ్ళేవాడిని. పడవ మీద దాదాపు ఐదు అడుగుల పొడవుండే వెదురు కర్రని నిలపెట్టి, దానిమీద నూనె దీపం పెట్టి, అది ఆరిపోకుండా దానిచుట్టూ గాజుబుడ్డి అమర్చి తెడ్డు వేసుకుంటూ గోదాట్లోకి తీసుకెళ్ళేవాడు. వలలు బయటకి తీసి చేపలు పడవలో వేస్తూ "పంతులూ కూతంత పక్కకి కూకో చేపలు మీద పడిపోగలవు" అనేవాడు.నేను నవ్వుతూ పక్కకి జరిగితే , సడెన్ గా నావైపు తిరిగి "పెళ్ళాం పుస్తెలమ్మైనా పులస తినాలంటారు ,క్యారేజీలొ పులుసుంది కూతంత  రుచి సూత్తావేటి" అనేవాడు. నేను నిర్లఖ్యంగా చూస్తే నవ్వేస్తూ సరదాకి అన్నాలే సామి అంటూ సత్తు క్యారెజీలో తెచ్చిన మసాలావేసి ఉడికించిన మొక్కజొన్న గింజల్లో సగం నాకు పెట్టేవాడు.

     పూర్తిగా వెన్నెల ఉన్నరోజుల్లొ ఐతే తను వలలో పడిన చేపలని పడవలో వేస్తూ ఉంటే, నేను ఆ వెన్నెల వెలుగులో వెండిలా మెరిసిపోతున్న గోదావరిని చూస్తూ గడిపేసేవాడిని.   చేపలు బాగా పడిన రోజున ఉత్సాహంగా బోల్డు కబుర్లు చెప్పేవాడు, లేకపోతే చుట్ట నోట్లో పెట్టుకుని కాలుస్తూ తత్వాలు చెప్పేవాడు.ఉన్నట్లుండి సడెన్ గా  నావైపు తిరిగి "గోదారి మా అమ్మ తెలుసా" అనేవాడు. తను చుట్ట కాలుస్తున్నప్పుడు సరదాపుట్టి  నాకుకూడా ఒక చుట్ట ఇమ్మని అడిగితే,వెంటనే తను కాలుస్తున్న చుట్టని తీసి గోదాట్లొకి విసిరేసి,"ఛీ! నీకెందుకు చెప్పు ఈ చెడ్డ అలవాటు, నువ్వు మంచి వాడివి, అలాగే ఉండు అనేవాడు."

                  వెంటనే నేను "అంటే నువ్వు చెడ్డవాడివా" అని అడిగేవాడిని ఠక్కున.

         ".....అనికాదనుకో , చిన్నప్పుడు నాన్నతో కలిపి చేపలు పట్టడానికి గోదాట్లోకి వెళ్ళేవాడిని.నడిగోదాట్లో చలేస్తోంది అంటే కప్పుకోడానికి నాన్న రగ్గు ఇచ్చేవాడు.నాన్నకి జబ్బు చేసిన తర్వాత పక్కింటి మామతో వెళ్ళేవాడిని, అప్పుడు చలేస్తోంది అంటే మామ చుట్ట ఇచ్చేవాడు. కొంతకాలానికి రగ్గు ఇచ్చిన నాన్న,చుట్ట ఇచ్చిన మామ ఇద్దరూ పోయారు. ఈ పాడు అలవాటు మాత్రం మిగిలి పోయింది.ఇప్పుదు ఒళ్ళు పాడవుతుండని తెలిసినామానలేకపోతున్నాను.నీకు వద్దులే ఇలాంటి చెడ్డ అలవాట్లు..." అనేవాడు.

చేపల వ్యాపారంలోవచ్చే డబ్బులు సరిపోకనో ఏమో తెలియదుగానీ, కొంతకాలానికి అతను బ్రతుకుదెరువు నిమిత్తం గల్ఫ్ దేశాలకి  వెళ్ళిపోయాడు.వెళ్ళేముందర నన్ను కలిసాడు. రోజంతా నాతోనే ఉన్నాడు. అదే అతన్ని అఖరిసారి కలవడం.మళ్ళీ నాకు కనిపించలేదు.తరువాత మేము కూడా ఉద్యొగం కోసం వెరే ఊరు మారిపోయాము.దాదాపుగా ఆరుసంవత్సరాలు గడచిపొయాయి. ఎప్పుడైన ఊరువెళ్ళినప్పుడు తను కనిపిస్తాడేమో అని ఒకసారి అలా పడవలరేవు వరకు వెళ్ళి వస్తాను.   కాని నాకు నిరాశే మిగులుతుంది.అతని చుట్టాలెవరితోనూ నాకు పరిచయం లేదు. కనుక అతని గురించి సమాచారం కూడా ఎమీ తెలియలేదు. కాని అతనితో స్నేహం మత్రం అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.  

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మొదటిసారి మీ బ్లాగు చూస్తున్నాను. రెండు టపాలు చదివాను. ఇంకా చదవాలి. బాగా వ్రాస్తున్నారు. అభినందనలు.

మన నరసాపురం గురించి చదువుతుంటే ఆనందంగా ఉంది. ఇంకొన్ని చదివి మళ్ళీ కామెంట్ చేస్తాను.

నాగశ్రీనివాస చెప్పారు...

@bonagiri : ధన్యవాదాలండి. మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి